మరో తిరుపతి.. తెలంగాణ తిరుమల క్షేత్రం
శ్రావణంలో భక్తుల సందడి
బీర్కూర్, సెప్టెంబర్ 3: పచ్చని చెట్లతో నిండి ఉన్న ప్రకృతి ఒడిలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి భక్తుల పూజలందుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దివ్యక్షేత్రం పచ్చదనంతో అలరారుతోంది. శ్రావణ మాసం పురస్కరించుకొని నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్నదీ ఆలయం. చుట్టూ పచ్చని పొలాలు, కొండపై కొలువుదీరాడు వేంకటేశ్వర స్వామి.
ఆలయం ప్రత్యేకత..
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య చారికి వేంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి తన ఆలయాన్ని బీర్కూర్ శివారులోని ఎత్తైన కొండపై నిర్మించాలని కోరాడట. దీంతో ఆయన స్వయంగా కింది నుంచి పైకి ఒక్కో రాయి తెచ్చి, ఒక్కో బిందెతో కాలినడకన నీరు తెచ్చి సిమెంటుతో వెంకన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రచారం. అనంతరం బీర్కూర్కు చెందిన ఓ వ్యక్తి ఆలయానికి మెట్లు నిర్మించారని భక్తుల వాదన. అప్పటి నుంచే వెంకన్న కొండకు చేరుకునే అవకాశాలు కనిపించాయని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ సిమెంటుతో ఏర్పాటు చేసిన వెంకన్న విగ్రహం, ఆలయానికి చేరుకునే మెట్ల దారి ఇంకా ఉన్నాయి.
ఆలయానికి చేరుకోవడం ఇలా..
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి సమీపంలోని బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. కామారెడ్డి వైపు నుంచి వెళ్లేవారు బాన్సువాడ మీదుగా, నిజామాబాద్, బోధన్ నుంచి వెళ్లే వారు వర్ని మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా నుంచి ఆలయానికి చెందిన బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. బిచ్కుంద, మద్నూర్ నుంచి వచ్చే వారు నూతనంగా నిర్మించిన కుర్లా-బీర్కూర్ వంతెన మీదుగా బీర్కూర్ చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి ఆటోల్లో చేరుకోవచ్చు.
పోచారం చొరవతో నూతన ఆలయం..
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో భూదేవి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీనికి ప్రధాన కారణం. ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస రెడ్డికి స్వామి వారిపై ఉన్న విశ్వాసమే. తన పెద్దకుమారుడు రవీందర్రెడ్డికి మాటలు రాకపోవడంతో ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించగా త్వరగా మాటలు వచ్చాయని ఆయన నమ్మకం.
రూ.13కోట్లతో ఆలయాభివృద్ధి
సీఎం కేసీఆర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా దేవాదాయ శాఖ ద్వారా రూ.13కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా సొంతంగా రూ.10లక్షలు అందజేశారు. దీంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
భగవంతుడి సహకారంతోనే ఆలయాభివృద్ధి..
భగవంతుడి సహకారంతోనే ఆలయాభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చొరవ అభినందనీయం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఈ ప్రాంతం సుఖసంతోషాలతో, పాడిపంటలతో చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నా.
శ్రావణ శనివారం ప్రత్యేకం..
ఏటా శ్రావణ మాసంలో వచ్చే ప్రతీ శనివారం వెంకన్న కొండపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తారు. శ్రావణమాసం వచ్చిందంటే చాలు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. అంతేకాకుండా ఆలయం వద్ద ప్రతీ శనివారం ఒకరు చొప్పున దాతలుగా నిలిచి అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు.