ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలోకి రెండోసారి..
నాలుగు సెట్ల నామినేషన్ల్లు దాఖలు
కోలాహలంగా కార్యక్రమం.. తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు
పూర్తి సంఖ్యాబలంతో టీఆర్ఎస్..
పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్, బీజేపీ
వివాదంలో ఇండిపెండెంట్ నామినేషన్
నిజామాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఖలీల్వాడి/ నిజామాబాద్ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏడాదిక్రితం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న కవిత తిరిగి పోటీచేస్తుండడంతో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు నిజామాబాద్ కలెక్టరేట్కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆమె తరఫున మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో సెట్ నామినేషన్ను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి కవిత రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మిగిలిన మూడు సెట్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. ఉపఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నాయి. పూర్తి సంఖ్యాబలం చేతిలో ఉండడంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇండిపెండెంట్గా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయగా.. దానిపై వివాదం రాజుకున్నది. తమ సంతకాలను ఫోర్జరీ చేశాడంటూ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. నేడు నామినేషన్ల పరిశీలన జరుగనున్నది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీగా రెండోసారి బరిలో దిగిన కల్వకుంట్ల కవితకు ఉభయ జిల్లాల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్కు తరలివచ్చి అభినందలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రముఖులతో కవిత నివాసం, క్యాంప్ కార్యాలయం కోలాహాలంగా మారింది. నిజామాబాద్ నగరంలో గులాబీ పార్టీ నేతలతో సందడి వాతావరణం కనిపించింది. కవిత మొత్తం నాలుగు సెట్లలో నామినేషన్ వేశారు. నాలుగో సెట్ నామినేషన్ను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు. మిగిలిన మూడు సెట్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు వేర్వేరుగా దాఖలు చేశారు.
తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు..
ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఖరారు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చారు. కవిత అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దారిపొడవునా స్వాగతాలు పలికారు. కామారెడ్డి జిల్లా కేంద్ర శివారులో టేక్రియాల్ వద్ద స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా కార్యకర్తలు మంగళహారతులతో దీవెనలు అందించారు. పటాకులు కాల్చి, డప్పు చప్పుళ్లతో కార్యకర్తలు సంబురం వ్యక్తం చేశారు. ఇందల్వాయి టోల్ప్లాజా, డిచ్పల్లి మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందలు తెలిపారు. నిజామాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు దారిపొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో నగరమంతా గులాబీమయంగా మారింది. కార్యకర్తలు అడుగడుగునా తమ అభిమాన నాయకురాలిపై పూల వర్షం కురిపించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత తన ఇంటి నుంచి కలెక్టరేట్ వైపు ముందుగు సాగారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచడం, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవిత మరోసారి మండలి అభ్యర్థిగా ఎంపిక కావడంపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ ఘట్టంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, ఎంపీలు బీబీపాటిల్, సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
నాలుగు సెట్ల నామినేషన్లు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా.. నిజామాబాద్ కలెక్టరేట్లో కవిత నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు కవిత తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావులు తొలి సెట్ నామినేషన్ వేశారు. రెండో సెట్ నామినేషన్ను ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ దాఖలు చేశారు. మూడో సెట్ నామినేషన్ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితకు మద్దతు ప్రకటించేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వందలాది మంది నిజామాబాద్ కలెక్టరేట్కు వచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల సందడితో నిజామాబాద్ నగరమంతా గులాబీమయమైంది.