కామారెడ్డి, మే 18 : కాయ్ రాజాకాయ్…ఆలోచిస్తే ఆశాభంగం. లక్ ఉంటే ఈజీగా మనీ సంపాదిస్తారు. ఒకటికి పది..పదికి వంద ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో సాగుతున్న ఐపీఎల్ దందా ఇది.. ఐపీఎల్ సీజన్లో యువత జీవితాలను పణంగా పెట్టి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు రూ. కోట్లలో టర్నోవర్ చేస్తూ దర్జాగా దందా ను కొనసాగిస్తున్నారు. ఓ రింగ్ మాస్టర్ కనుసన్నల్లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని మూడు పువ్వు లు…ఆరు కాయలు అన్న చందంగా నిర్వహిస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న బెట్టింగ్భూతం…
కామారెడ్డి జిల్లాలో ప్రతిఏటా చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వ్యాపిస్తున్నది. ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా జోరుగా బెట్టింగ్ సాగుతున్నది. ప్రధానంగా యువకులు ఈ ఉచ్చులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు బెట్టింగ్ కాసి జే బులు ఖాళీ చేసుకుంటున్నారు. కొందరైతే బంగా రు నగలను తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్లకు పాల్పడడం విస్మయం కలిగిస్తున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుం ద, పిట్లం, గాంధారి, దోమకొండ, భిక్కనూరు తదితర ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతున్నది.
జిల్లా కే్రందంలో పలు అపార్ట్మెంట్లు, లాడ్జీలు, హోటళ్లలో బెట్టింగ్ వ్యవహారం గుట్టుగా సాగుతున్నది. సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటు లో రావడంతో బెట్టింగ్ రాయుళ్లకు మరింత కలిసి వస్తున్నది. జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం అంతా సెల్ఫోన్ల ద్వారానే సాగుతున్నది. ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి బుకీల నుంచి స్థానిక యువత కు గ్రూప్ ద్వారా వివరాలు తెలియజేస్తూ బెట్టింగ్ వ్యవహారం సాగిస్తున్నారు. ఈ యాప్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ సాగుతున్నా పోలీసుల తనిఖీలు మాత్రం కనపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో యువత, ఉద్యోగులు, నాయకులు వేలు, లక్షల్లో బెట్టింగ్ పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు పక్కనే గల నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన వారు టీములుగా ఏర్పడి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన యువత, విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్లో చిక్కుకుంటూ తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటూ అప్పుల పాలవుతున్నారు.
ప్రాంతాల వారీగా నిర్వాహకులు…
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పరిధిలో విస్తరించడంతో ప్రాంతాల వారీగా బెట్టింగ్ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కు సరిహద్దున కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఉండడంతో అక్కడి నుంచి బుకీలు ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు అంతా ఆన్లైన్లోనే సాగిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంటున్న తరుణంలో బెట్టింగ్ మరింత ఊపందుకున్నది. ఐపీఎల్ బెట్టింగ్ కోసం కామారెడ్డిలో ఓ యువకుడు లక్షలాది రూపాయల అప్పుగా చేసినట్లు తెలిసింది. ఓ చిట్ఫండ్ వ్యాపారి రూ.5లక్షల వరకు బెట్టింగ్లో కోల్పోవడంతో దివాళా తీసినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి, బాన్సువాడ పరిధిలో జరిగిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం విషయంలోనే కొంతమంది పోలీసులపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది బెట్టింగ్వైపు పోలీసులు కన్నెత్తి చూడడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
టీములను బట్టి చెల్లింపు శాతం…
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో చెల్లింపుల ప్రక్రియ విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచుల్లో టీమ్లను బట్టి శాతాన్ని నిర్ణయిస్తారు. ఇది మ్యాచ్ ఆరంభానికి అరగంట ముందుగా ధర నిర్ణయం తీసుకుంటారు. ఒకటికి రెండు, రెండుకు నాలుగు, ఒకటికి పది విధంగా చెల్లింపులు ఉంటాయి. దీంతో క్రికెట్ బెట్టింగ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి యువత మొగ్గుచూపి బానిసగా మారిపోతున్నారు. ఈ బెట్టింగ్ను ముఖ్యంగా వాట్సాప్లో వివిధ రకాల కోడ్ భాషలతో బెట్టింగ్ కాస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవు
క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా.. అందుకు సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు, యువత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక నిఘా పెట్టాం.
–సోమనాథం, కామారెడ్డి డీఎస్పీ