బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 23 : అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించేవారిని ఉపేక్షించేదిలేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పనులను వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తిచేయాలన్నారు.
నూతన భవనాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ నెల 29న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రానున్నారని, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని నస్రుల్లాబాద్ మండల పరిధిలోని నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారని తెలిపారు. మోస్రా మండలం పరిధిలో చేపట్టనున్న ఆయకట్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను స్థానిక నాయకులు సమన్వయంతో చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ కృష్ణారెడ్డి, బుడ్మి విండో చైర్మన్ శ్రీధర్, బీర్కూర్ ఎంపీపీ రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ద్రోణవల్లి అశోక్, పెరిక శ్రీనివాస్, కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్, చందూర్ సర్పంచ్ సాయిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.