నిజామాబాద్ క్రైం/ బీర్కూర్, ఏప్రిల్ 22;ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఉద్యోగార్థులంతా ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. గ్రామీణ, నిరుపేద యువత వేల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. సొంత ఖర్చులతోపాటు దాతల సహకారంతో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి వేముల సహకారంతో పోలీసు, గ్రూప్స్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, వర్నిలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పీబీఆర్ కోచింగ్ సెంటర్ల పేరుతో శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ సర్కారు కొలువును సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మీరు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందిస్తాం.. ఎంతైనా ఖర్చు పెడతాం.. మీరు మాత్రం ఉద్యోగాలు సాధించి మీ తల్లిదండ్రుల కల నెరవేర్చండి అంటూ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే పోచారం భాస్కర్రెడ్డి పీబీఆర్ కోచింగ్ సెంటర్ పేరిట బాన్సువాడ నియోజకవర్గంలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిరుపేద యువతకు ఉచిత శిక్షణ ఇవ్వాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా నస్రుల్లాబాద్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల వారికి బాన్సువాడ కేంద్రంగా, వర్ని, రుద్రూర్, చందూర్, కోటగిరి, మోస్రా మండలాల వారికి వర్నిలో శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
నిష్ణాతులైన ఫ్యాకల్టీతో కోచింగ్..
హైదరాబాద్లో పేరెన్నికగల కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇచ్చే నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఇక్కడ బోధిస్తున్నారు. శిక్షణా కాలంలో, అనంతరం సబ్జెక్టుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. రూ.5వేల విలువజేసే స్టడీ మెటీరియల్ను అభ్యర్థులకు ఉచితంగా అందజేయనున్నారు. మ ధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ అందజేస్తున్నారు. ఈ కోచింగ్ కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, పంచాయతీ కార్యదర్శి, ఎస్జీటీ ఇతర ఉద్యోగాలకు తరగతులను నిర్వహిస్తున్నారు. గతంలో పీబీఆర్ కోచింగ్ సెంటర్లో సుమారు వెయ్యి మంది ఉచిత శిక్షణ పొందగా 60 మంది ఉద్యోగాలు సాధించారు.
సంకల్పానికి తోడుగా వేముల
నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభు త్వం త్వరలో ఆయా విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యం లో వాటిని అందిపుచ్చుకొనేందుకు యువత కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నది. కోచింగ్ ఖర్చుతో కూడిన వ్యవహారం. వేల రూపాయలు ఖర్చు పెట్టలేని పేద యువతకు ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, దాతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలు వరంగా మారుతున్నాయి. నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో కానిస్టేబుల్, ఎస్సైతోపాటు గ్రూప్ 1,2,3, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కోసం ఇటీవల ఉచిత కోచింగ్ను ప్రారంభించారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సౌజన్యంతో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు కృషితో వివిధ శాఖ ల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న 979 మం ది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణకు సుమారు రూ.50 వేల నుంచి లక్ష వరకు ఫీజు చెల్లించా ల్సి ఉంటుంది. ప్రభుత్వ సహకారంతోపాటు దాతల కృషితో మంత్రి వేముల ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించడంపై ఉద్యోగార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లాఠీ పక్కన పెట్టి.. చాక్పీస్ చేతపట్టి
పోలీసు ఉద్యోగం అంటేనే కత్తిమీద సాము లాంటిది. క్షణం తీరిక లేకుండా ఉంటారు. అలాంటిది దొరికిన కాస్త ఖాళీ సమయంలో చాక్పీస్ చేతపట్టారు ఈ పోలీసులు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో టౌన్ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై మశ్చేందర్రెడ్డిలు ఉద్యోగార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ తోడ్పాటునందిస్తున్నారు. తాము ఉద్యోగాల కోసం చదివేటప్పుడు కోచింగ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం తెలుసని, డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేని వారికి కోచింగ్ ఇవ్వడం చాలా సంతృప్తినిస్తుందని చెబుతున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
నాన్న కోరిక నెరవేరుస్తా..
మాది మధ్యతరగతి కుటుంబం. మా తండ్రి శంకర్ ప్రైవేటు కంపెనీలో సేల్స్మెన్గా పని చేస్తూ నన్ను చదివించారు. ఐదేండ్ల కిందట మా నాన్న చనిపోయాడు. మా నాన్న బతికున్నన్ని రోజులు నన్ను యూనిఫాంలో చూడాలని ఆశపడ్డారు. ఆయన ఆశలను ఎలాగైనా నెరవేర్చాలని నిర్ణయించుకున్నా. మంత్రి వేముల అందజేస్తున్న ఫ్రీ కోచింగ్తో నా తండ్రి కన్న కలలను సాకారం చేసేందుకు ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి ఉండదు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి యూనిఫామ్ వేసుకొవాలనే సంకల్పంతో కృషి చేస్తాను.
– బి. సరిత (గొల్లపల్లి, డిచ్పల్లి మండలం)
గ్రూప్స్లో జాబ్ సాధిస్తా..
ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించేందుకు ప్రక్రియ ప్రారంభించడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించి మా కుటుంబానికి చేదోడుగా నిలవాలనే నిశ్చయంతో ఉన్నాను. కానిస్టేబుల్ పరీక్షకు ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఎత్తు తక్కువగా ఉండడంతో అర్హత సాధించలేదు. ఎంతో నిరాశ చెందాను. గ్రూప్స్ ఉద్యోగానికి ఉచిత కోచింగ్ ఇస్తామంటూ మళ్లీ కాల్ చేశారు. ఎంతో ఉత్సాహం కలిగింది. శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రూప్స్లో జాబ్ సాధించి తీరుతా. – ఎస్. శ్రావణ్, మాక్లూర్
పేదలకు సేవ చేయడమే మా తల్లిదండ్రులు నేర్పారు..
మా తల్లిదండ్రులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి-పుష్పమ్మ పేదలకు సేవ చేయడమే మాకు నేర్పారు. మా తండ్రి అడుగజాడల్లోనే నడిచి మంచి పేరును సంపాదించాలన్నదే నా సంకల్పం. పేదలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబ సభ్యులు, మిత్రులు. అభిమానుల సహకారం తోనే పీబీఆర్ కోచింగ్ కేంద్రం నడుస్తున్నది.
– పోచారం భాస్కర్రెడి, డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
కానిస్టేబుల్ అయ్యేందుకు అవకాశం దొరికింది
నేను కానిస్టేబుల్ అయ్యేందుకు అవకాశం దొరికింది. పేద కుటుంబంలో పుట్టిన నాకు కానిస్టేబుల్ అయ్యేందుకు ఉచితంగా శిక్షణ అందిస్తున్న పోచారం కుటుంబానికి రుణపడి ఉంటా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా. పోచారం భాస్కర్రెడ్డికి కృతజ్ఞతలు.
-ఎస్.లక్ష్మణ్, భైరాపూర్, బీర్కూర్ మండలం
లెక్చరర్ అవుతా..
నేను పీబీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ప్రభుత్వ లెక్చరర్గా ఉద్యోగం సాధిస్తా. కోచింగ్ తీసుకున్న చోటే యువతకు ఉచితంగా పాఠాలను బోధిస్తా. పీబీఆర్ సార్ ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాదు, భోజన వసతి సైతం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. పేదల కష్టాలను అర్థంచేసుకొని ఇంతటి ఏర్పాట్లను చేసిన భాస్కర్రెడ్డికి చేతులెత్తి మొక్కాలి.
–కావేరి, బాన్సువాడ
గ్రూప్ -2 అధికారిణి కావడమే నా లక్ష్యం
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలని ఇబ్బందిపడ్డాను. పోచారం భాస్కర్రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది గ్రూప్-2 అధికారిణి అవుతా. పీబీఆర్ కృషితో ఎక్కడికో వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన బాధ తప్పింది. కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తా.
–నవనీత, బాన్సువాడ