బాన్సువాడ, ఏప్రిల్ 22 : పేదలు ఎక్కువగా ఉంటున్న గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు తమ సేవలను అందించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందించిన సేవలు అమోఘమని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పా రు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ.11, 500 కోట్లు కేటాయించారని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12, 755 వైద్యులు , సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సృష్టికి మూలం తల్లి అని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. తల్లి పాలు పుట్టిన బిడ్డకు అమృతం లాంటివ న్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగాయన్నారు. వందశాతం ప్రసవాలు అయ్యేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు గుడ్లు, పాలు, ఒక పూట పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఎటువంటి రోగాలు దరి చేరవని తెలిపారు. మితంగా మాంసాహారం తీసుకోవాలని సూచించారు.
జబ్బు వచ్చిన తరువాత చికిత్స కోసం డబ్బులు ఖర్చుచేసే బదులు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకొని నివారించవచ్చన్నారు. అనంతరం స్పీకర్ పోచారం ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, ఆరోగ్య సిబ్బంది ద్వారా టీబీ కిట్లను ఎమ్మెల్యేలకు అందజేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వాడిన కూరగాయలు, పండ్లు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందని అన్నారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ , పర్యవేక్షకులు శ్రీనివాస్ ప్రసాద్, విజయలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, హన్మాజీపేట్ పీహెచ్సీ వైద్యాధికారిణి విజయలక్ష్మి, వైద్యుడు సంతోష్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మహ్మద్ ఎజాస్, బాబా, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బూనేకర్ జ్యో తి, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది దస్తీరాం, మహేశ్ , సా యిలు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
29న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రాక
ఈ నెల 29న బాన్సువాడకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్సువాడలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాన్సువాడ నర్సింగ్ కళాశాల భవనం, వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.