‘దళితబంధు’ లబ్ధిదారులతో కలెక్టర్ జితేశ్ పాటిల్
విద్యానగర్, మార్చి 26 : దళితబంధు పథకం లబ్ధిదారులు అనుభవం ఉన్న రంగాల్లో ఉపాధి పొందేలా యూనిట్లను మూడు రోజుల్లో ఎంచుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులతో శనివారం సమీక్షించారు. గ్రామాలు, మండలకేంద్రాల్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. డెయిరీ, పౌల్ట్రీ ఫామ్, గొర్రెలు, మేకల యూనిట్లు, పండ్ల తోటలు, చేపల పెంపకం, బట్టల వ్యాపారం, సెంట్రింగ్ యూనిట్లు, మినీ సూపర్ మార్కెట్, పిండి గిర్నీ తదితర వాటిలో లాభాలు పొందవచ్చని వివరించారు. నైపుణ్యమున్న రంగాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి ఐచర్, పొక్లెయినర్ తదితర వాహనాలు తీసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లకు విడుతల వారీగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ టాక్స్ వసూళ్లను వంద శాతం పూర్తిచేయాలి
ప్రాపర్టీ టాక్స్ వసూలు, ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియను మూడు రోజుల్లోగా వంద శాతం పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న ఇంటి పన్నును సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.