మాచారెడ్డి, డిసెంబర్ 20 : గల్ఫ్ ఏజెంట్ మోసానికి ఓ కార్మికుడు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. విదేశాల్లో చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామానికి చెందిన పల్లికొండ స్వామి సెలూన్ షాపు నిర్వహించుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈక్రమంలో కామారెడ్డి పట్టణంలోని మెగా ట్రావెల్స్కు చెందిన ఏజెంట్ ప్రశాంత్రావుతో పరిచయం ఏర్పడింది. మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.60 వేలు వసూలుచేసి అక్టోబర్ 9న స్వామిని కౌలాలంపూర్కు పంపించాడు. అక్కడ స్వామిని రిసీవ్ చేసుకున్న ఏజెంట్ మనుషులు.. ఓ గ్యాంగ్స్టర్కు అప్పజెప్పారు.
వారు స్వామిని చిత్రహింసలకు గురిచేసి మరొకరికి అమ్మేశారు. స్వామికి బలమైన దెబ్బలు తగలడంతో పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఓ సెలూన్లో పనిచేయించుకున్నారు. వెన్నెముక దెబ్బతిని నడువలేని దుస్థితికి చేరడంతో అక్కడి తెలుగువారి సహాయంతో ఈ నెల 11న స్వగ్రామానికి తిరిగి వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం రూ. 2లక్షలు ఖర్చు చేసినట్లు బాధితుడు స్వామి తెలిపాడు. ఇప్పటి వరకు రూ. 5లక్షల వరకు నష్టపోయినట్లు చెప్పాడు. తన భర్తను మోసంచేసి చిత్రహింసలు పెట్టించిన ఏజెంట్ ప్రశాంత్రావును నిలదీస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడని స్వామి భార్య నాగలక్ష్మి వాపోయారు. తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వారి పోషణ భారంగా మారిందన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకున్నారు.
ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం.. కాపర్ వైర్, ఆయిల్ చోరీ
మండలంలోని కారేగాం శివారు పొలాల్లో ఏర్పాటుచేసిన రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అందులోని కాపర్ వైర్, ఆయిల్ను చోరీ చేశారని రైతులు తెలిపారు. గతంలోనూ దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారని, దీంతో పంటలకు కరెంటు సరఫరా సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.