బాన్సువాడ రూరల్/లింగంపేట /తాడ్వాయి/రాజంపేట్, డిసెంబర్ 20 : యాసంగి పంటల సాగుపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణపై సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్ క్లస్టర్లో పరిధిలోని కోనాపూర్, కాద్లాపూర్, హన్మాజీపేట్, సంగోజీపేట్ గ్రామాల్లో డీఏవో భాగ్యలక్ష్మి మంగళవారం పర్యటించి శనగ, మక్కజొన్న, చెరుకు పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటలకు తెగుళ్లు సోకితే తప్పని సరిగా వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. యాసంగిలో సాగుచేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఏఈవో మీనాకు సూచించారు.
లింగంపేట మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పద్మపాణి సంస్థ ఆధ్వర్యంలో భూసారం, సాగులో తడి, పొడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవో మధుసూదన్ మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగిస్తే భూసారం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. వరి సాగులో తడి, పొడి విధానాన్ని పాటిస్తూ భూమిని ఆరబెడుతూ నీటిని అందిస్తే తెగుళ్ల బెడద ఉండదన్నారు. కార్యక్రమంలో పద్మపాణి సంస్థ ప్రతినిధి షేక్ సాదిక్, ఎంపీటీసీ షమీమున్నీసా బేగం, రైతులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలకేంద్రంలో శగన పంటలను ఏడీఏ రత్న పరిశీలించారు. పంటను ఎండు తెగులు, పచ్చ పురుగు ఆశించకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. జాగ్రతలు తీసుకుంటే దిగుబడి అధికంగా వస్తుందన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు.
రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామంలో వ్యవసాయ, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కజొన్న పంటలో విత్తన శుద్ధి, చీడపీడలు, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, పంటకోత, నిల్వ చేసే విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో మన్యూష, పీపీవో రవిశంకర్, సర్పంచ్ విఠల్రెడ్డి, ఉప సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ బాల్రాజ్ గౌడ్, రైతుబంధు సమితి మండల సభ్యుడు రామారావు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.