నిజామాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నోటిదురుసుకు ఎమ్మెల్సీ కవిత ‘చెప్పు’తో సమాధానం ఇచ్చారు. మరోసారి తప్పుడు కూతలు కూస్తే తగిన శాస్తి తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోసాలు, అబద్ధాలతో గెలుపొందిన అర్వింద్.. టీఆర్ఎస్ నేతలపై తప్పుడుకూతలు కూస్తున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కవితను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా ఆమె సంయమనం పాటించారు. ఎన్ని విమర్శలు చేసినా సహించారు. అయితే, ఆమె సహనాన్ని అలుసుగా తీసుకున్న అర్వింద్ మరింత రెచ్చిపోతున్నారు. దీంతో ఓపిక నశించిన ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా భగ్గుమన్నారు. తప్పుడు కూతలు కూస్తే తంతామని హెచ్చరించారు. మరోవైపు, జాగృతి, టీఆర్ఎస్ నేతలు ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మోసాలు, అబద్ధాలతో ఎంపీగా ఎన్నికైన అధర్మపురి అర్వింద్కు ఎక్కడకు వెళ్లినా నిరసన సెగ తగులుతున్నది. బాండ్ పేపర్ సంగతి ఏమైందనే ప్రశ్న ప్రజల నుంచి వెంటాడుతున్నది. జనం ఛీత్కరిస్తున్నా అర్వింద్ తీరు మార్చుకోవడం లేదు. నోటి దురుసు తగ్గించుకోవడం లేదు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులపై తప్పుడు కూతలు కూస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత విషయంలో మరీ ఎక్కువగా దుష్ప్రచారం చేస్తున్నాడు. మహిళ అని కూడా చూడకుండా విమర్శల స్వరం పెంచాడు. మూడున్నరేండ్లుగా సంయమనంతో ఉన్నా.. అర్వింద్ మరీ దిగజారుడు రాజకీయం చేస్తుండడంతో కవిత ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఓపిక నశించిన ఎమ్మెల్సీ.. ఇందూరు ఎంపీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. మరోమారు నోటికొచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. బిడ్డా నువ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని సవాల్ విసిరారు. మరోవైపు, ఎంపీ వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జాగృతి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
బిడ్డా.. వెంటాడుతా..
ఎంపీ ధర్మపురి అర్వింద్ నోటి దురుసు మరీ ఎక్కువవుతున్నది. భాష అదుపు తప్పుతున్నది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ ఎంపీకి కవిత గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డితో కలిసి హైదరాబాద్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్సీ.. ఎంపీ తీరుపై ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కవిత కోపోద్రిక్తులయ్యారు. మూడున్నరేండ్లుగా ఓపికతో చూసీచూడనట్లుగా ఉంటున్న ఆమె.. దిమ్మతిరిగే విధంగా వార్నింగ్ ఇవ్వడంతో అర్వింద్ బిత్తర పోవాల్సి వచ్చింది. పార్టీ మార్పుపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ కాదు. ఇంకోటి కాదు.. నా బతుకు, నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ వాసన లేని పార్టీలతో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు. అభాండాలు వేయాలి. ప్రజలను గందరగోళం చేయాలనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ‘అర్వింద్ గుర్తు పెట్టుకో… ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. తమషాలు అయితున్నాయా. చూస్తూ ఊరుకుంటే భాష లేదు. పద్ధతి లేదు. మాట లేదు. మంతి లేదు. ఏం చేసినావ్. అదే విధంగా ఇట్లా మాట్లాడినవనుకో మామూలుగా తన్నం. పట్టుకుని తంతాము. బిడ్డా చెబుతున్నా. ఎక్కడికి పోతావో ఎన్నికల్లో పో. వెంటాడి ఓడిస్తా నిన్ను. చూస్తూ ఊరుకుంటుంటే తమాషాలు అవుతున్నాయని’ కవిత నిప్పులు చెరిగారు.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాల్నా?
ఎంపీ అర్వింద్ దిగజారుడు రాజకీయాలపై ఎమ్మెల్సీ మండిపడ్డారు. రాజకీయాలు చెయాలని, కానీ అది మర్యాదగా ఉండాలని అన్నారు. ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటానన్నారు. ‘తెలంగాణలో ఒక్కటే చెబుతారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం కుక్కలకు అర్థం కాదు. ఇంకోసారి నా మీద, నేను పార్టీ మారతానని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకుని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డా.. ఏమనుకున్నావో. అన్పార్లమెంటరీ, ఇంకోటి అనుకోండ్రి. 16 సంవత్సరాలు చాలా ఓపికతో ఉన్న నన్ను ఇంత మాట అనిపించిండు అంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో ప్రజలే ఆలోచన చేయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. ఆవేదన, బాధతో మాట్లాడుతున్నా. నన్ను చూసి 10 మంది రాజకీయాల్లోకి రావాలనుకున్నా. కానీ ఇలాంటోళ్ల(అర్వింద్)తో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని’ కవిత ఆవేదన వ్యక్తంచేశారు.
రేపట్నుంచి చీటింగ్ కేసులు..
బాండ్ పేపర్ పేరుతో చేసిన మోసాన్ని ఎమ్మెల్సీ మరోసారి గుర్తుచేశారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన అర్వింద్ తక్షణమే పసుపు రైతుల కాళ్లు పట్టుకుని బేషరతుగా క్షమాపణలు కోరాలని కవిత డిమాండ్ చేశారు. అర్వింద్పై పసుపు రైతులు చీటింగ్ కేసులు పెడతారని చెప్పారు. బీజేపీ అనుబంధ సంఘాల్లో పని చేసిన పసుపు రైతు మనోహార్రెడ్డి ఏండ్లుగా పసుపుబోర్డు గురించి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఆయన వల్లనే పసుపు బోర్డు అంశాన్ని లేవనెత్తి ప్రయత్నాలు మొదలు పెట్టానని కవిత వివరించారు. మనోహార్రెడ్డికి బీజేపీలో గౌరవం లేదన్నారు. అర్వింద్ రాజస్థాన్ యూనివర్సిటీలో చదువుకున్నది ఫేక్ అని, దీనిపై విచారణ చేయాలని తానే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు కవిత తెలిపారు. మా ఎంపీ అర్వింద్ బురద లాంటోడు. ఆయన మీద రాయి వేస్తే తెల్లటి మన బట్టలే పాడవుతాయని ఇన్నాళ్లు వదిలేశ. అంతే తప్పా అతనో వీరుడో. సూరుడో అని కాదని ఎమ్మెల్సీ వివరించారు. ‘నిన్న ఆయన (అర్వింద్) మాట్లాడిన మాటలు అసహ్యం వేశాయి. నేనట ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్లోకి పోతానట. ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండంట. నువ్వే(అర్వింద్) వాళ్లతో టచ్లో ఉన్నవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి పని చేసింది నిజం కాదా’ అని కవిత ప్రశ్నించారు. అర్వింద్ ఎంపీ అవ్వడం నిజామాబాద్ ప్రజల దురదృష్టం, ఖర్మ అని వ్యాఖ్యానించారు.
అర్వింద్ గుర్తుపెట్టుకో..
“కాంగ్రెస్ పార్టీ కాదు. ఇంకోటి కాదు. నా బతుకు, నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు, వాసన లేని పార్టీతో నాకు సంబంధం ఎందుకుంటది. 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏ వ్యక్తినీ పర్సనల్గా తిట్టలేదు. అర్వింద్ గుర్తు పెట్టుకో.. ఇంకోసారి నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. ఇట్లానే మాట్లాడినవనుకో మామూలుగా తన్నం. పట్టుకుని తంతాము. బిడ్డా నీకే చెబుతున్నా. ఎన్నికల్లో ఎక్కడికి పోతావో పో. వెంటాడి ఓడిస్తా నిన్ను.”
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ