విద్యానగర్, నవంబర్ 18 : అర్హత కలిగి పింఛన్లురాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి.. జాబితా తయారు చేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఆసరా, బీడీ కార్మికుల, దివ్యాంగుల పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను యాసంగిలో రైతులు సాగు చేసుకొని లాభాలు పొందాలని సూచించారు. పంటల మార్పిడి విధానంపై రైతు వేదికల్లో వ్యవసాయి విస్తరణ అధికారులు అవగాహన కల్పించేలా మండల వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. బీమా ఉన్న రైతుల వివరాలు రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో చదివి వినిపించాలని కోరారు.
ధరణి సమస్యలను పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామని చెప్పాడు. పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తులను 100 శాతం పరిశీలించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశాలకు డివిజన్, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరైతే తనకు లేఖ ద్వారా సమాచారం పంపాలని తెలిపారు. గైర్హాజరైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. అర్హులైన వారికి ఆసరా పించన్లు మంజూరయ్యేలా డిసెంబర్లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. దళితులందరికీ దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తున్నదని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి త్వరలో 1,500 మందికి దళిత బంధు పథకం ద్వారా నిధులు మంజూరవుతాయని చెప్పారు. మూడేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వస్తుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ఎక్కువగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూశారని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.