నిజామాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;జాతీయ, అంతర్జాతీయ వాహనాలు ఇందూరుకు తరలి రానున్నాయి. అధునాతన టెక్నాలజీతోపాటు ట్రెండింగ్లో ఉన్న వెహికిల్స్ ఒకేచోట కొలువు దీరనున్నాయి. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ‘ఆటో షో’ ఇందుకు వేదిక కానున్నది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ అధునాతన వాహనాలను ఇందులో ప్రదర్శించనున్నాయి. వాహనాలపై రుణ సదుపాయానికి సంబంధించిన అంశాలను వివరించేందుకు నాలుగు జాతీయ బ్యాంకులు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు ఆటో షోను ప్రారంభించనున్నారు.
మెట్రో నగరాలకే పరిమితమైన ఆటో షో కార్యక్రమం నిజామాబాద్ నగర ప్రజలకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు చేరువ చేస్తున్నాయి. ఈ మేరకు 2021లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కొనసాగింపుగా శని, ఆదివారాల్లో పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజుల పాటు మరోమారు వాహన ప్రదర్శన అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఆటోమొబైల్ కంపెనీలతో పాటు పలు ద్విచక్ర వాహన తయారీ సంస్థలకు చెందిన డీలర్లు సైతం తమ ఉత్పత్తులను ప్రదర్శించబోతున్నారు. మొత్తం 22 స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం పాలుపంచుకుంటున్నాయి. నిజామాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో లేని వాహనాలను సైతం పలు తయారీ సంస్థలకు చెందిన డీలర్లు తీసుకు వస్తున్నారు. వాటికి సంబంధించిన విశేషాలను ఔత్సాహికులకు వివరించడంతో పాటు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అక్కడికక్కడే కల్పించబోతున్నారు.
తక్షణమే రుణ సదుపాయం…
వాహనాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్న వారికి జాతీయ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. వాహన రుణాలను తక్కువ వడ్డీతో అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నాలుగు బ్యాంకులకు చెందిన స్టాళ్లు ఏర్పాటు అవుతున్నాయి. వాహనాదారులకు వెహికిల్ లోన్ ప్రాసెసింగ్ సంబంధిత అంశాలను ఆటో షోలోనే నివృత్తి చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు తమ స్టాళ్లను నెలకొల్పుతున్నారు. బ్యాంకు తరఫున అందిస్తున్న వడ్డీ రేట్లు, ప్రత్యేక స్కీముల వివరాలను బ్యాంకర్లు వివరిస్తారు. లోన్ ప్రాసెసింగ్కు సంబంధించిన అంశాలపై వాహనదారులకు నివృత్తి చేస్తారు. అవసరమైన వారికి తక్షణం లోన్ మంజూరు చేసేలా సైతం ఏర్పాట్లు కూడా చేస్తారు. వాహన ప్రదర్శనలోనే బ్యాంకులకు సంబంధించిన స్టాళ్లను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ఔత్సాహికులకు ఒకింత మేలైన సౌకర్యాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు.
ప్రారంభించనున్న మంత్రి వేముల…
ప్రతిష్టాత్మక ఆటో షో కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటలకు కలెక్టరేట్ మైదానంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. మంత్రితో పాటు ఆటో షో కార్యక్రమానికి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, డీటీసీ వెంకట రమణతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు.
తళుక్కుమననున్న అధునాతన వాహనాలు…
ప్రస్తుతం మార్కెట్లో అధునాతన సాంకేతికతతో కూడిన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు సైతం దేశీయంగానే ఉత్పత్తి చేసి మన ప్రాంతంలోనూ విదేశీ బ్రాండ్ వాహనాలను చేరువ చేస్తున్నాయి. అలాంటి అనేక కంపెనీలకు చెందిన బ్రాండెడ్ వెహికిల్స్ శని, ఆదివారాల్లో నిజామాబాద్ వేదికగా ప్రదర్శనకు రానున్నాయి. ఇందులో పేరొందిన కంపెనీలు వరుస కట్టబోతున్నాయి. కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు సైతం కొలువుదీరుతాయి. ఇందులో బ్యాటరీ వాహనాలు సైతం ప్రదర్శనకు రానున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. మహవీర్ స్కోడా, కియా, ఇసుజు, లక్ష్మీ నిస్సాన్, టాటా మోటర్స్, మారుతి సుజుకీ – వరుణ్ మోటార్స్, అప్రిల్లా వెస్పా ఆర్.ఆర్.ఆర్. మోటర్స్, యమహా ఉదయ మోటర్స్, నెక్సా, శ్రీరాం హోండా, బిగాస్, రాయల్ ఎన్ఫీల్డ్, వెంకటేశ్వర హీరో, వోక్స్ వాగన్ పీపీఎస్ మోటర్స్, మోరీస్ గారేజెస్(ఎంజీ), బీవైడీ స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.