బాన్సువాడ టౌన్, నవంబర్ 18 : పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన కార్తిక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి – పుష్పమ్మ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి – సోనీ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. సంఘం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి మండపాలను స్పీకర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం మాట్లాడుతూ కార్తిక దీపోత్సవాన్ని ఇంత గొప్పగా నిర్వహించడంపై పట్టణ ఆర్యవైశ్య సంఘం వారిని అభినందించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైన్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, బాన్సువాడ ఎంపీపీ శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పాత బాలకృష్ణ గుప్తా, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులకు పెద్దపీట
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ సహకారంతో కుమ్మరి కులస్తులకు సబ్సిడీ పనిముట్లను సభాపతి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చందూర్ మండలానికి చెందిన కుమ్మరి రాజు, కుమ్మరి గోపి, కుమ్మరి మహేందర్, రుద్రూర్కు చెందిన కుమ్మరి బాలరాజు, వర్ని మండలానికి చెందిన కుమ్మరి రవికి 5 యూనిట్లు 80 శాతం సబ్సిడీ కింద మంజూరైనట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలనేదే ఈ పథకం ముఖ్యఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి గంగ కిషన్, సుమలత, చందూర్ సర్పంచ్ సాయిరెడ్డి, దుర్కి ఎంపీటీసీ నారాయణ, లక్ష్మాపూర్ సత్యనారాయణ, చందూర్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.