ఖలీల్వాడి/బోధన్/సిరికొండ, నవంబర్ 18 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్ను తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. నిరసనగా నిజామాబాద్ జిల్లాకేంద్రంతోపాటు బోధన్, సిరికొండలో ఎంపీ దిష్టిబొమ్మలను శుక్రవారం దహనం చేశారు.
అర్వింద్వి మతిలేని ఆరోపణలు..
నిజామాబాద్ నగరంలోని ధర్నాచౌక్లో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఎంపీ అర్వింద్.. మతిలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి కవితపై గెలువాలని సవాల్ విసిరారు. ఇన్నాళ్లూ కవిత సహనంతో ఉన్నారని, ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తే ఇక ప్రజలు ఊరుకోబోరని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. అర్వింద్ అంతిమయాత్ర మొదలైందని హెచ్చరించారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు, నరాల సుధాకర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రభాకర్, అలీం పాల్గొన్నారు.
పిచ్చి కూతలు మానుకో..
బోధన్లో జాగృతి నియోజకవర్గ ఇన్చార్జి గట్టు హరికృష్ణ, టీఆర్ఎస్ పట్టణ కార్మిక విభాగం అధ్యక్షుడు రవిశంకర్గౌడ్ మాట్లాడారు. మహిళా ప్రజాప్రతినిధిపై కనీస గౌరవం లేకుండా అర్వింద్ పిచ్చి కూతలను మానుకోవాలని హెచ్చరించారు. అర్వింద్ మాటల్లోనే ఆయన సంస్కృతి బయటపడిందన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నియోజవర్గంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నరేశ్, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్జాదవ్, జాగృతి యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు అల్లాడి దేవా, నాయకులు సిరివేసు సంతోష్, జక్క సంజీవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో తిరగనివ్వం..
సిరికొండలో జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న అర్వింద్ను గ్రామాల్లో తిరగనివ్వబోమని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటున్న ఎమ్మెల్సీ కవితపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోవర్ధన్, నాయకులు నరేశ్, ఆదిత్య, మహేశ్, భాస్కర్రెడ్డి, రామస్వామి, రాజేందర్, రంజిత్, నరేశ్, రణధీర్, దేవేందర్, వినీల్, నరేందర్, రూపేశ్, భూపతి, ప్రశాంత్ పాల్గొన్నారు.