బాల్కొండ, నవంబర్ 7: లింబాద్రి గుట్ట సోమవారం భక్తజన సంద్రమైంది. శ్రీమన్నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. శ్రీవారి రథోత్సవం వైభవోపేతంగా సాగింది. భక్తుల జేజేల నడుమ శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథంపై ఊరేగారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి, రథాన్ని లాగారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నింబాచల శ్రీలక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని నింబాచలంపై సోమవారం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ వంశపారంపర్య నంబి వంశస్తులు, వేద పండితులు నంబి పార్థసారథి, విజయ్సారథి, వాసుదేవాచార్యులు, వేణు, శ్రీనివాస్, విష్ణువర్ధన్, లింబాద్రి, మహేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి రథప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపారు. నింబాచల లక్ష్మీనారసింహున్ని ఆహ్వానించి షోడశోపచారాలను నిర్వహించారు. రథం ఎదుట గరుత్మంతుని ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం హోమం, పూర్ణ్ణాహుతి, అగ్నిహోత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని పూలతో సుందరంగా అలకరించి, రథంపై దేవతా చిత్రపటాలను ఏర్పాటు చేశారు.
పూల తొట్టెలతో ప్రకాశించే రథం మూడో అంతస్థులో ఉన్న భగవత్ సింహాసనాన్ని సుందరంగా అలంకరించారు. రథప్రతిష్ట అనంతరం గోవింద నామస్మరణల మధ్య మంగళహారతులు, మేళతాళాలు, డప్పుచప్పుల్ల మధ్య రథోత్సవ కార్యక్రమం మొదలైంది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కొండకు పోటెత్తారు. జాతర సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 200మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలతా సురేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ నాయకుడు మధుశేఖర్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు మల్లెల రాజశ్రీలక్ష్మణ్, లింగయ్య, లత, నర్స య్య, గంగాధర్, భూదేవి, సతీశ్ పాల్గొన్నారు.
రథాన్ని లాగిన మంత్రి..
నింబాచలంపై సోమవారం నిర్వహించిన రథోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి స్వయంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. రథోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గుడికి వెళ్లే దారిలో చేసిన అభివృద్ధి పనుల(డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్)పై ప్రజలు మంత్రితో సంతోషాన్ని పంచుకున్నారు. రోడ్లు బాగా వేశారు.. సౌకర్యాలు బాగున్నాయంటూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న చిన్నారులు, మహిళలు మంత్రితో సెల్ఫీ దిగారు.