ఖలీల్వాడి, నవంబర్ 7 : కార్తిక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు అవాకులు చవాకులు పేలిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తిక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానన్నారు. ఎంతో మహిమ గల నీలకంఠేశ్వరుడిని కార్తిక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు.