నిజామాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అంతటా ప్రజల్లో తెలియని బాధ కనిపిస్తోందని చెప్పారు. చిన్నపాటి లోటుపాట్లు, పొరపాట్లతోనే బీఆర్ఎస్కు నష్టం వాటిల్లిందని కేటీఆర్ చెప్పారు. గెలుపోటములు శాశ్వతం కానప్పటికీ బాధ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం గులాబీ సైనికులంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. కరెంట్ కటకట, ఎండుతున్న పొలాలతో రైతులు గోస పడుతున్నారని చెప్పారు. రైతుబంధు రాక, పొలాల పరిస్థితి తెలియక అగమ్యగోచరంగా పరిస్థితి తయారైందన్నారు. కామారెడ్డిలో నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించగా కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన కార్యక్రమంలో ముఖ్య నేతలు కూలంకషంగా మాట్లాడారు. కేసీఆర్ ఓటమిపై గంపగోవర్ధన్ శ్రేణుల ముందే క్షమాపణలు కోరగా… ప్రతి ఒక్కరూ చక్కగా పని చేశారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ అసంబద్ధ హామీలు, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళం సృష్టించాయని కేటీఆర్ వివరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో గంపగోవర్ధన్ నేతృత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామంటూ పేర్కొన్నారు.
హామీల అమలుకు వెంటాడుతాం..
రేవంత్రెడ్డి మగాడైతే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో తాండవిస్తున్న కరువు కాలం తెచ్చింది కాదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుగా అభివర్ణించారు. రోజుకు 2 టీఎంసీలు నీళ్లు కాళేశ్వరం మేడిగడ్డ వద్ద ఎత్తిపోసే వీలున్నప్పటికీ ప్రభుత్వం చేయట్లేదన్నారు. మేడిగడ్డలో 88 పిల్లర్లలో 3 పిల్లర్లు సమస్య వస్తే మూడు నెలల్లో మూడు పిల్లర్లు బాగు చేయించే వ్యవస్థ లేదా? అని ప్రశ్నించారు. మార్చి 15 వరకు ఓపిక పడతామని ఆ తర్వాత భరతం పడతాం అంటూ హెచ్చరించారు. మొన్న కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలే అన్న వ్యాఖ్యలపైనా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎస్… నా అయ్య కేసీఆర్ అంటూ బదులిచ్చారు. రాహుల్గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన వేదికపైనే శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ను చుట్టూ పెట్టుకొని మాట్లాడడం గొంగలిలో కూర్చుని వెంట్రుకలు ఏరినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మా అయ్య పేరు కేసీఆర్. బరాబార్ వచ్చినా. ఉద్యమంలో వచ్చినా. నీ లెక్కా ఆంధ్రోళ్ల బూట్లు నాకి, దొంగ సంచులు మోసి రాలేదు. ఐదుసార్లు గెలిచినా. రాంగ్ రూట్లో రాలే. చవట పనులు చేసి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారి రాలేదు. ఎస్… మా అయ్య కేసీఆర్… తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ బదులిచ్చారు.
ఎన్నికల కోడ్కు ముందే జీవో జారీ చెయ్..
రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూయకముందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటకు రూ.500 బోనస్ ప్రకటిస్తూ జీవోను నేడో రేపో జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరిట రైతులను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడని ఆరోపించారు. పొంకనాల పోతిరెడ్డిగా రేవంత్ రెడ్డిని అభివర్ణించారు. మాటలు, అరుపుల, బొబ్బలు చూసి అందరూ రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారని చెప్పారు. సీఎం స్థాయిలో ఎవరైనా ఇట్లా మాట్లాడతారా అని జనాలే అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కట్టిన సచివాలయంలో కూర్చొని కేసీఆర్ ఏం చేయలేదని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లంకె బిందెల కోసం గడ్డపారాలు, తట్టలు పట్టుకొని రాత్రిపూట వచ్చేది పచ్చి దొంగలేనని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పేగులు మెడలో వేసుకుంటానంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఏమైనా బోటీ కొట్టేటోడా అని చెప్పారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పే ముఖ్యమంత్రికి అలా ఎవరు సంచరిస్తారో తెలియదా? అని అన్నారు. దొంగలు మాత్రమే జేబులో కత్తెరలు పెట్టుకుంటారని మండిపడ్డారు.
గంప భావోద్వేగం…
సమావేశంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భావోద్వేగానికి గురయ్యారు. సభలో గద్గద స్వరంతో ఆయన ప్రసంగం మొదలైంది. మొదటగా కేసీఆర్ ఓటమికి క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా కన్నీళ్లు కార్చడంతో గులాబీ శ్రేణులంతా గంభీర వాతావరణంలో మునిగి పోయారు. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ అనూహ్యంగా కామారెడ్డిలో పరాజయం పాలవ్వడం జీర్ణించుకోలేక పోతున్నట్లుగా గంప గోవర్ధన్ వెల్లడించారు. చెమ్మగిల్లిన కళ్లతోనే గంప గోవర్ధన్ ప్రసంగాన్ని కొనసాగించారు. సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, బీఆర్ఎస్ లీడర్లు ఎంజీ వేణుగోపాల్, నర్సింగరావు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
వంద రోజులు నిండినంకా వదిలేది లేదు…
గులాబీ శ్రేణులెవ్వరూ నిరాశ పడాల్సిందేమీ లేదని, ఉమ్మడి జిల్లాలో 9 సీట్లలో రెండు బాన్సువాడ, బాల్కొండ గెలిచామన్నారు. బోధన్, జుక్కల్, కామారెడ్డిలో చిన్నపాటి తేడాతోనే ఓడిపోయామని తెలిపారు. చిన్నపాటి లోటుపాట్లు, పొరపాట్లతోనే నష్టం జరిగిందని, మనకు ప్రజలు 119లో 39 సీట్లు ఇచ్చారని ఇవి తక్కువ సీట్లు కావన్నారు. రైతులంతా లోన్లు తెచ్చుకోవాలని రెచ్చగొట్టిండని డిసెంబర్ 9న రద్దు చేస్తానని తేదీలు చెప్పి ఇప్పుడు మూడు నెలలైనా రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలను తప్పక యాది జేస్తాం… ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక పోతే భరతం పడతాం అంటూ హెచ్చరించారు. ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. వంద రోజులు నిండినంకా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఆడబిడ్డలేనని జోస్యం చెప్పారు. మార్చి 15కు కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల సినిమా పూర్తవుతుందని, శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా ఆగినట్లు కాంగ్రెస్ వంద రోజుల పాలన వరకు ఆగుదామన్నారు. ఆ తర్వాత విడిచి పెట్టేది ఉండదన్నారు.
రేవంత్రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతాడు..
సీఎం రేవంత్రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారని, తన గురువు చంద్రబాబుతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని మోదీ వద్దకు వెళ్లాడని, కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హితవుపలికారు. అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారని అన్నారు. నమ్మి అధికారం ఇస్తే ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావొస్తున్నా చేసిందేమీ లేదని, ఇప్పటి వరకు రైతుబంధు వేయలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని, మల్కాజిగిరిలో పోటీ చేద్దామని కేటీఆర్ విసిరిన సవాల్కు ఇప్పటికీ నోరుమెదపలేదన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.
ఎంపీ ఎన్నికలను చాలెంజ్గా తీసుకుందాం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను చాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్దామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి ఫలితాలను తారుమారు చేశాయని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి.. ఎన్నికల సమయంలో గ్రామాల్లో గుళ్లు, గోపురాలకు విరాళాలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి గెలవలేదా అని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేకపోతే గ్రామగ్రామాన నిలదీస్తామన్నారు.