నిజాంసాగర్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి పేరుతో గ్రామాలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పెద్దకొడప్గల్లో వైకుంఠధామాన్ని, పాఠశాలలో అదనపు తరగతి గదులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. పల్లెప్రగతిలో గ్రామాలకు లక్షలాది నిధులను మంజూరు చేస్తుండడంతో వైంకుఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్డు, పంచాయతీకి ట్రాక్టర్, తాగునీటి వసతులు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇలా అన్ని వసతులు చేకూరుతున్నాయని చెప్పారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ, పింఛన్లు, రెండు పడకల గదుల నిర్మాణం, రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్రెడ్డి, నాయకులు హన్మంత్రెడ్డి, జాఫర్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ తిర్మల్రెడ్డి, గుండెరావు, విజయ్దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన పీఆర్టీయూ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ అమలుతో పాటు పదవీ విరమణ వయస్సును మరో మూడు సంవత్సరాల పాటు పొడగించడంతో ఉదోయగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పెద్దకొడప్గల్లోని విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్షిండేను పీఆర్టీయూ బాధ్యులు శాలువా కప్పి సత్కరించారు. పదవీ విరమణ వయస్సు మరో మూడేండ్లు పెంచడంతో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో దేవీసింగ్, పీఆర్టీయూ మండల నాయకులు పాల్గొన్నారు.