వేల్పూర్, ఏప్రిల్ 29: కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ముఖ్యంగా సెకండ్ వేవ్లో కేసులతోపాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలతోపాటు పల్లెల్లోనూ కేసులు వెలుగుచూస్తుండడంతో గ్రామస్తులు అప్రమత్తమవుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకుంటున్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకుండా పకడ్బందీగా కట్టడి చర్యలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నది వేల్పూర్ మండలం సాహెబ్పేట్ గ్రామం. మహమ్మారి తమ గ్రామ పొలిమేరలకు కూడారాకుండా నివారణ చర్యలు పాటిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సాహెబ్పేబ్ చిన్న గ్రామం. గ్రామజనాభా కేవలం 526. గ్రామంలో వ్యవసాయం తరువాత ఇతర గ్రామాలకు వెళ్లి రోజూవారి కూలిపనులపై ఆధాపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామం ఈతకల్లుకు పెట్టింది పేరు. దీంతో ఇతర గ్రామాల నుంచి తాకిడి ఎక్కువగా ఉంటుంది. గ్రామం నుంచి పని నిమిత్తం పొరుగు ఊళ్లకు వెళ్లిరావడం..కల్లు కోసం ఇతర గ్రామాల వారు నిత్యం రావడం కారణంగా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ముందుగానే గుర్తించారు. సెకండ్వేవ్ ప్రారంభమైన తొలిరోజుల్లోనే కరోనా కట్టడి కోసం ఆంక్షలను విధించుకొని అమలుచేయడం ప్రారంభించారు.
పొరుగు గ్రామాలకు పనులకు వెళ్లడాన్ని తగ్గించేలా చేశారు. కల్లు కోసం వచ్చేవారికి ఫలానా అడ్డాలో లొట్టీలు ఉంచామని ఫోన్ ద్వారా చెబుతున్నారు. డబ్బులను కూడా ఫోన్పే ద్వారా స్వీకరిస్తున్నారు. అలాగే గ్రామం నుంచి బయటికి పాలను కూడా సరఫరా చేస్తారు. సరఫరా చేయడంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ నివారణ చర్యలు చేపడుతున్నారు. గతంలో పాలను బాటిళ్ల ద్వారా సరఫరా చేసేవారు. దీంతో బాటిళ్లను తరచూ తాకడంవల్ల కరోనా వచ్చే అవకాశం ఉందని గ్రహించి, పాలను పాలిథిన్ కవర్లోనే సరఫరా చేయాలని వ్యాపారులకు సూచించారు. గ్రామంలోకి ఇతర గ్రామాలకు చెందినవారిని 90శాతం నియంత్రించారు. మండల కేంద్రానికి కిరాణా సరుకులు, ఇతర అవసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే వెళ్లి వచ్చేలా అనుమతి ఇచ్చారు. దాదాపు నెల రోజులుగా కట్టడి చర్యలను అమలు చేసుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. దీనిని వైద్యాధికారులు కూడా ధ్రువీకరించారు. కట్టడితోపాటు మహమ్మారి బారిన పడకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ ఆధ్వర్యంలో నివారణ చర్యలు చేపడుతున్నారు.