తాళం వేసిన ఇండ్లే టార్గెట్
వరుస చోరీలతోబెంబేలెత్తుతున్న ప్రజలు
ధర్పల్లి, ఆగస్టు 25 : తాళం వేసిన ఇండ్లు, బైకులు, సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకుపోతున్నారు. ధర్పల్లి మండలంలో ఇటీవల వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మండల ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు మైలారం, ప్రాజెక్టు రామడుగు, దుబ్బాక తదితర గ్రామాల్లో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటికి తాళం వేసి వెళ్లాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 3న మండల కేంద్రంలోని శ్మశానవాటిక వద్ద నిలిపిన బైక్ను, ధర్పల్లి మార్కెట్లో ఉంచిన మోపెడ్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ నెల 17న మండల కేంద్రంలోని మసీదు దగ్గర అజ్జు బేగం ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు పదిన్నర తులాల బంగారు ఆభరణాలు, ఎజాజ్ ఇంటి తాళాలు పగుల గొట్టి అరతులం బంగారం, రూ. 20వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేకుండాపోయిందని బాధితులు వాపోతున్నారు. సండే వచ్చింది కదా సంతకు వెళ్దామన్నా భయం పట్టుకున్నది. కారణం అంగట్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మాటువేసి అదను చూసి సంతకు వచ్చిన వారి సెల్ఫోన్లు మా యం చేస్తున్నారు.
వరుస చోరీలతో బెంబేలు
మండలంలోని ఒక గ్రామం కాకపోతే ఇంకో గ్రా మం అన్న చందంగా దొంగలు తాళం వేసిన ఇండ్ల ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో మండల వాసులు బెంబేలెత్తుతున్నారు. సెల్ఫోన్లు పోతున్న సంఘటనలు కొంతకాలంగా చోటు చేసుకుంటూ నే ఉన్నాయి. సెల్ఫోన్ కొట్టేయడమే తరువాయి వారు అక్కడి నుంచి మాయమవుతారు. నిమిషాల్లోనే మాయమైన సెల్ఫోన్లు స్విచ్చాఫ్గా మారుతున్నాయి. ఇలా ప్రతి సంత రోజూ ఒకరిద్దరి సెల్ఫోన్లు మాయమవడం పరిపాటిగా మారింది. మండల కేంద్రానికి చెందిన నజీర్, డి.గంగాధర్, శ్రీనివాస్నాయక్, రాజన్న, నారాయణ, చక్రవర్తి, శ్రీనివాస్, నందు, మాలకొండయ్య, గంగాధర్, ఇలా చెబు తూ పోతే చాలా మంది బాధితులున్నారు. సెల్ఫోన్ పోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి చోరీలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు చేయడానికి జంకుతారని, ఒకవేళ దొంగతనాలు జరిగినా సీసీ కెమెరాల ఫుటేజీతో దొంగలను పట్టుకోవడం చాలా సులువవుతుందని పోలీసులు అంటున్నారు.
పోలీసులు నిఘా పెట్టాలి
దొంగతనాలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. మా చెల్లెలు అజ్జు బేగం ఇంటికి తాళం వేసి పీరీలను చూసి వచ్చి ఊరిలోనే ఉన్న మా వద్దకు వచ్చింది. తెల్లారి చూసే సరికి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పటికీ దొంగలు దొరకలేదు. పోలీసులు గట్టి నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
-ఎం.డి.సుజావొద్దీన్, ధర్పల్లి
అరగంటలోనే బైక్ మాయం
ఈ నెల 3న ధర్పల్లి గ్రామ శివారులోని రేకులపల్లి రోడ్డులో ఉన్న శ్మశాన వాటిక దగ్గర బైక్ను నిలిపి పొలం పనులకు వెళ్లాం. అరగంటలో తిరిగి వచ్చే సరికి బైక్ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.
-బూర్గుల చిన్నయ్య, రైతు, ధర్పల్లి గ్రామం.