బాన్సువాడ, జూన్ 21: గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో ముందుకు సాగాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడలోని క్యాంప్ కార్యాలయంలో మండలంలోని గ్రామాలు, పట్టణం, వార్డుల వారీగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి చేప ట్టే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి మరో ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని చెప్పారు. అర్హులకు మాత్రమే డబుల్ ఇండ్లు కేటాయించాలని, అవకతవకలు జరిగితే సహించేది లేదని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.వంద కోట్లు మంజూరు చేసిందని, వీటిని గ్రామాల్లో అవసరాల మేరకు వినియోగిస్తామని తెలిపారు. గ్రామాల్లో పనులను గుర్తించడానికి, సజావుగా చేపట్టడానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని స్పీకర్ సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, పీఆర్ ఏఈ శంకర్, నాయకుడు దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల బాలకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పట్టణంలోని వంద పడకల దవాఖాన నుంచి ఏరియా దవాఖానకు నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు.