కామారెడ్డి/ బీర్కూర్/ గాంధారి/ ఎల్లారెడ్డి రూరల్/ తాడ్వాయి/ బీబీపేట్, ఏప్రిల్ 18 : జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆదివారం 17 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రవిరాజా తెలిపారు. మొత్తం 91 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. 17 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గాంధారి మండలకేంద్రంతో పాటు ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా పరీక్షలను నిర్వహించారు. 134 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించగా.. 42 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల పీహెచ్సీలో 19 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు. మండలపరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో పాజిటివ్ బారిన పడిన వారికి సర్పంచ్ గౌలపల్లి సురేఖ, మల్లేశ్ పలు సూచనలు చేశారు.
తాడ్వాయి మండలపరిధిలోని ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు నిర్వహించగా.. 28 మందికి పాజిటివ్గా నమోదైనట్లు వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 78 మందికి టెస్టులు చేయగా.. 28 కేసులు నమోదైనట్లు తెలిపారు. కన్కల్లో 2, దేమెకలాన్లో 4, తాడ్వాయిలో 2, ఎర్రాపహాడ్లో 2, నందివాడలో 8, బ్రహ్మాజివాడిలో 2, సోమారంలో 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. బీబీపేట్ పీహెచ్సీలో 62 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
భిక్కనూరు మండలంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 18 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని, ఇందులో పెద్దమల్లారెడ్డి, రామేశ్వర్పల్లికి చెందిన ఒక్కొక్కరికి, నిర్మల్ జిల్లా ముథోల్కు చెందిన 13 ఏండ్ల బాలుడికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.
కరోనా కట్టడికి చర్యలు
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 18 : బాన్సువాడ పట్టణంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారితోనే కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని, అక్కడి నుంచి వచ్చే వారిపై గట్టి నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట నాయకులు కనుకుట్ట రాజు, రాజాగౌడ్, రవీందర్ తదితరులు ఉన్నారు.