నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి
బాన్సువాడలో విస్తృత పర్యటన.. పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కోరిన వెంటనే కేసీఆర్ నిధులిచ్చారు
ప్రతి కుటుంబానికీ సొంతిల్లే లక్ష్యం
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
బాన్సువాడ, ఆగస్టు 11: ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చిన అన్ని పనులనూ సీఎం కేసీఆర్ సహకారంతో పూర్తిచేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హామీల అమలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి పనికీ కాదనకుండా, కోరిన వెంటనే నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయంలో ఆచార్యుల భవనం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కల్యాణ మండపం నిర్మాణ పనులకు ఆయా సంఘాల సభ్యులతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది నిధులు తెచ్చి అభివృద్ధి పనులను పూర్తిచేశానని గుర్తుచేశారు. ప్రతి కుటుంబానికీ సొంతిల్లు ఉండాలనేదే తన ఆకాంక్ష అని, ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గంలో పదివేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించానని అన్నారు. బాన్సువాడ పట్టణంలోనే వివిధ అభివృద్ధి పనులకుగాను రూ. 9 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. తిమ్మాపూర్ ఆలయాన్ని సీఎం కేసీఆర్ మొదటగా దర్శించుకున్నప్పుడు రూ. 13 కోట్లు మంజూరు చేశారని, ఆ తర్వాత కూడా నిధులను తెచ్చి భక్తులకు సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. స్వామివారికి 2 కిలోల బంగారు కిరీటాన్ని చేయిస్తున్నామని, తనవంతుగా తన సతీమణి పుష్ప పేరిట పది తులాల బంగారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. భక్తులు కూడా తోచిన విధంగా విరాళాలు అందించాలని స్పీకర్ కోరారు. ఆర్డీవో రాజాగౌడ్, అర్అండ్బీ డీఈ మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు దొడ్ల వెంకట్రామ్రెడ్డి, గురు వినయ్కుమార్, మహ్మద్ ఎజా స్, నర్సింహారెడ్డి, బాబా, నార్ల రత్నకుమార్, దేశాయిపేట్ సర్పంచ్ శ్రావణ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిన్నారులతో సరదాగా..
బాన్సువాడలోని చైతన్యకాలనీలో రూ.మూడు లక్షలతో ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్ పార్కును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో.. నేనెవరో తెలుసా? మీతో ఆడనిస్తారా ? అంటూ కొంతసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. చైతన్య కాలనీలో వినాయక మండపానికి రూ.10 లక్షలు, రెడ్డి సంఘం సమీపంలో వినాయక మండపానికి రూ.3 లక్షలు, అయ్యప్ప సన్నిధానం కోసం రూ.5 లక్షలు, రెడ్డి సంఘానికి రూ.20లక్షలు, పద్మశాలీ సంఘానికి రూ.15లక్షలు, అంగన్వాడీ భవనం కోసం రూ.తొమ్మిది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.