పలుమండలాల్లో భారీగా వర్షాలు
ఆనందంలో రైతన్న. సాగు పనుల్లో బిజీ
కామారెడ్డి టౌన్/డిచ్పల్లి/చందూర్/రుద్రూర్/మోర్తాడ్, జూన్ 10 : సీజన్ ప్రారంభంలోనే గురువారం భారీ వర్షం కురవడంతో ఉమ్మడి జిల్లా తడిసి మురిసింది. మృగశిరకార్తె ప్రారంభానికి ముందే సాగుకు సిద్ధం చేసిన వ్యవసాయభూముల్లో వర్షపు నీరు నిలువడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంపై సాయంత్రం వేళ మేఘాలు కమ్ముకొని వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. డిచ్పల్లి, చందూర్, రుద్రూర్, మోర్తాడ్ మండలం సుంకెట్లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలో రోడ్లు జలమయమయ్యాయి. నాగిరెడ్డి పేట్లో 1.2 మి.మీ, మాచారెడ్డిలో 4.2, దోమకొండలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.