అడ్డుకట్టల నిర్మాణంతో సాగునీటికి భరోసా
మంజీరానది వెంట పెరుగనున్న భూగర్భజలాలు
కామారెడ్డి జిల్లాకు రూ.171.88 కోట్లతో 41 చెక్డ్యాములు మంజూరు
జెట్ స్పీడ్గా సాగుతున్న నిర్మాణ పనులు
జూలై నెలాఖరు వరకు పూర్తిచేయడమే లక్ష్యం
బాన్సువాడ, జూన్ 6:రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. ఒకవైపు పంట పెట్టుబడి సాయం రూపంలో రైతుబంధు, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్న సర్కారు మరోవైపు సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చెక్డ్యాములను నిర్మిస్తున్నది. చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతోపాటు వృథా నీటిని ఒడిసి పట్టుకునే వీలు కలుగుతుంది.
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 41 చెక్డ్యాములను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి కోసం రూ.రూ.171.88 కోట్లను కేటాయించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించిన నీటి పారుదల శాఖ అధికారులు.. పనులు జెడ్ స్పీడ్తో కొనసాగేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మంజీరానదిపై చెక్డ్యాములను నిర్మించడంతో నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి తాగు, సాగునీటి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. వర్షాలు పుష్కలంగా కురియడంతో ప్రతి ఏడాది సుమారు పది నుంచి 30 టీఎంసీల నీరు మంజీరానది ద్వారా వృథాగా పోతున్నది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం వరకు ఎలాంటి అడ్డుకట్టలు లేవు. దీంతో చెక్డ్యాములను నిర్మించి నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.
చకచకా నిర్మాణ పనులు..
జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో జూన్ నెలాఖరు వరకు 15 ప్రదేశాల్లో చెక్ డ్యాముల నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో 22 చెక్డ్యాముల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో ఐదు చెక్డ్యాముల నిర్మాణ పనులు జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. బాన్సువాడ మండలంలోని చింతల్నాగారం, బీర్కూర్, బిచ్కుంద మండలంలోని గుండెనెమ్లి, పుల్కల్లో మంజీరానదిపై నాలుగు పెద్ద చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. వీటి పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. చింతల్నాగారంలో రూ.15.98 కోట్ల వ్యయంతో 450 మీటర్ల పొడవుతో చెక్డ్యామ్ను నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికే 300 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఈ చెక్డ్యామ్ నిర్మాణంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వంద ఎంసీఎఫ్టీల నీరు నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1500 ఎకరాలకు సాగునీటికి ఢోకా ఉండదు. బీర్కూర్లో రూ.28.29 కోట్ల వ్యయంతో 1300 మీటర్ల పొడవుతో చెక్డ్యామ్ నిర్మిస్తుండగా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. దీని ద్వారా 3,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వానకాలం ప్రారంభం కావడంతో వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని, పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.