కామారెడ్డి : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరందించే 22 వ ప్యాకేజీకి సంబంధించిన పనులను పూర్తిచేయాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో సాగునీటి వనరుల విషయాన్ని ప్రస్తావించారు. కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బోరుబావుల ద్వారా మాత్రమే సాగునీటి సౌకర్యం ఉందన్నారు. ఈ రెండు నియోజకర్గాలకు నీరందించే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు కొంత మేర మాత్రమే జరిగాయని అన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు భగవంతుని దయతో 26 ఏళ్ల తర్వాత కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీబీపేట, జంగంపల్లి చెరువులు నిండాయని గుర్తు చేశారు. 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి పంటపొలాలకు నిరంతరం సాగునీరందించే విధంగా కృషి చేయాలని జిల్లాకు చెందిన బాన్సువాడ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. కాళేశ్వరం పనులకు సంబంధించి భూసేకరణ చేపట్టాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ విషయాన్ని నోట్ చేసుకున్నట్లు తెలిపారు.