పిట్లం/బాన్సువాడ టౌన్/ గాంధారి/ లింగంపేట/ భీమ్గల్/నిజాంసాగర్/బీర్కూర్/ ఎడపల్లి/ చందూర్ /బాన్సువాడ, మార్చి18: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో శనివారం కురిసిన అకాల వర్షం ఇటు ఆహ్లాదంతోపాటు అటు రైతులకు నష్టాన్ని కలిగించింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం కొంతమేరకు చల్లబడినప్పటికీ.. కొన్ని గ్రామాల్లో వడగండ్లు పడడంతో.. పంటలకు నష్టం వాటిల్లింది. బాన్సువాడ, గాంధారి మండల కేంద్రాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడ్డారు. పిట్లం మండలం ధర్మారం గ్రామంలో వడగండ్లు పడ్డాయి. గాంధారి ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎండిపోతున్న మక్కజొన్న, వరి పంటలకు మేలు చేస్తాయని పలువురు రైతులు తెలిపారు. లింగంపేట మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. భవానీపేట, బాణాపూర్ తండా, బాణాపూర్, మోతె తదితర గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. వడగండ్లతో వరి పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లు పడగా.. గోన్గొప్పులలో పంట నేలకొరిగిందని రైతులు తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామ శివారులో ఓ తాటిచెట్టుపై పిడుగు పడింది. గంట పాటు కురిసిన వర్షానికి వరి పంట నేలకొరిగింది. తున్కిపల్లి గ్రామంలో ఓ రేకుల షెడ్డు గాలికి కొట్టుకుపొయి విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పెద్దకొడప్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో వడగండ్లు పడ్డాయి. బీర్కూర్ మండలంలో రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో వడగండ్ల వానకు పంటలకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో ఈదురుగాలులతోపాటు వడగండ్ల వర్షం కురిసింది.