పేద కుటుంబాల దశను మార్చేందుకే కార్యాచరణ
దళితుల ఉన్నతితోనే సమాజ అభ్యున్నతి
75 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యపడని పథకమిది
కామారెడ్డి నియోజకవర్గంలో వంద యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి
నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
నిజామాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పేదల జీవితాల్లో చీకట్లను తరిమివేసే కాంతిపుంజం దళితబంధు.. అని అభిప్రాయపడ్డారు ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్. 75 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రికీ ఇలాంటి ఆలోచన కనీసం స్ఫురించలేదని ఆయన తెలిపారు. దళితబంధు అమలుకు తీసుకుంటున్న చర్యలపై ‘నమస్తే తెలంగాణ’కు గురువారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంప గోవర్ధన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కేసీఆర్ ప్రవేశపెట్టే ఏ పథకమైనా దూరదృష్టితో ఆలోచించి అమల్లోకి వచ్చిందే. పథకం ఫలాలు క్షేత్రస్థాయిలో పేదలకు అందేలా ఆయన ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా తెలంగాణ సమాజం పొందుతున్న ఫలితాలు ప్రస్తుతం మన కండ్లముందున్నాయి. దళితబంధు కూడా అలాంటిదే. దళితుల ఉన్నతితోనే సమాజ అభ్యున్నతి సాధ్యమవుతుందన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రకటించారు’ అని గోవర్ధన్ వివరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికను ఇప్పటికే పూర్తిచేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక ఊరిలో కొద్ది మందికిచ్చి మిగిలిన వారికి తట్టుపెట్టే బదులుగా సంపూర్ణంగా ఒక ఊరికి యూనిట్లు మంజూరు చేసే ప్రణాళికను అమలుచేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే ఏ పథకమైనా పేద ప్రజలను ఉద్దేశించినవే ఉంటాయి. వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు పకడ్బందీగా పథకాలకు రూపకల్పన చేస్తారు. నామ్కే వాస్తే అన్నట్లు కాకుండా పక్కాగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా సీఎం ఆలోచనలు ఉంటాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనాల ఆధారంగా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. వాటి ఫలితాలను మనమంతా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా దళితబంధు పథకం అన్నది అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా మంచి ఫలితాలు వచ్చాయి. అట్టడుగులో ఉన్న దళితులను సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 యూనిట్లతో ప్రయోగాత్మకంగా అమలు చేసి… వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద మొత్తంలో లబ్ధిదారుల ఎంపిక చేపడతామని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. దళితబంధు పథకం అమలు తీరుతెన్నులపై ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆయన పలు ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
నమస్తే : దళితబంధు పథకం అమలులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందా?
గంప గోవర్ధన్ : కామారెడ్డి నియోజకవర్గంలో దళితబంధు పథకానికి లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. మరోసారి జాబితాను సరి చూసుకుని తుది వివరాలను కలెక్టర్కు అందిస్తాం. ప్రస్తుతం 100 యూనిట్ల మంజూరు అనేది ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపడుతున్నది. అనంతరం వచ్చే వార్షిక బడ్జెట్లో దళితబంధుకు కేటాయింపులు భారీగా ఉండబోతున్నాయి. తద్వారా నిధుల మంజూరును అనుసరించి లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ పోతాం. రూ.10కోట్లతో తొలి దశలో వంద మందికి ప్రయోజనం చేకూరుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో దళితబంధు అమలు పర్యవేక్షణకు డీపీవో ప్రభాకర్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించాం.
పూర్తి రాయితీతో కూడిన ఈ పథకం అమలుపై దళిత సమాజం నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది?
వంద శాతం రాయితీతో పథకాన్ని అమలు చేయడం బహుశా ఏ రాష్ట్రంలో లేకపోవచ్చు. రాయితీని నూటికి నూరు శాతం ఇవ్వాలంటే ధైర్యం కావాలి. అంతకన్నా ఎక్కువగా పేద ప్రజలపై అమితమైన ప్రేమ ఉండాలి. ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నాయి. అందుకే ప్రజలంతా నివ్వెర పోయేలా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు అమలు కూడా చేస్తున్నారు. దళిత సమాజం నుంచి మంచి స్పందన వస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని అమలు చేయడంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళిత మేధావులు, దళిత సంఘాలు ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాయి. గ్రామాల్లో నేటికీ ఆర్థిక అసమానతలతో దళిత కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. వీరికి దళితబంధు ద్వారా లాభం చేకూరబోతుంది.
మీ రాజకీయ అనుభవంలో ఇలాంటి పథకాన్ని ఎప్పుడైనా చూశారా?
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు కొండంత భరోసా లభించింది. ప్రజల నుంచి వాటా రూపంలో డబ్బులు డిపాజిట్ చేసే పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. గతంలో ప్రజల వాటాకు ప్రభుత్వ వాటా కలిపి పథకాలను అమలు చేశారు. కేసీఆర్ మనస్ఫూర్తిగా ప్రజల మేలును ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఇచ్చే ప్రయోజనాన్ని ప్రజల కడుపు నింపేలా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కల్యాణలక్ష్మి/షాదీముబారక్లో పెళ్లీడు వచ్చిన యువతులకు రూ.లక్షా 116 అందుతున్నది. పింఛన్లు గతానికి పదుల రెట్లు రూ.2016 ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటే చాలా పథకాలున్నాయి. ఇప్పుడు దళితబంధు ద్వారా రూ.10లక్షలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే పథకమిది. నా మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాన్ని కలలో కూడా చూడలేదు. దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని భూలభ్యత ఆధారంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. అదే స్ఫూర్తితో దళితబంధును అమలు చేయబోతున్నాం.
ప్రజల మేలు కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజల్లో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదుగుతోంది. మా ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలతో ప్రతిపక్ష పార్టీలకు మైండ్ బ్లాక్ అవుతున్నది. వారికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కేసీఆర్ను ఎదుర్కోలేక ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం, లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎన్నికల తర్వాత ఈ పథకం ఉండదని కాంగ్రెస్, బీజేపీ చెప్పాయి. మరిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు కాబోతున్నది. ప్రతిపక్ష పార్టీల తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. వారికి సరైన సందర్భంలో తగిన సమాధానం చెబుతారు.