ఖలీల్వాడి, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం 2022-23లో అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై మాట్లాడారు. యాసంగిలో జిల్లాలోని 2,29,422 మంది రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 199.49 కోట్లు జమచేశామన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 8,360 ఎకరాలకు బిందు, తుంపర్ల సేద్యం కోసం అనుమతులు మంజూరు చేశామన్నారు. రూ. 10.58 లక్షలతో 147 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచుతున్నట్లు వివరించారు. ఆయిల్పామ్ సాగుద్వారా ఏడాదిలో ఎకరానికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు.
పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 180 రోజులకు రూ. రూ. 2లక్షలు మించకుండా 75 శాతం వడ్డీలేని రుణం అందిస్తున్నామన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 89 సహకార సంఘల ద్వారా 60,036 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామన్నారు. వానకాలంలో 79 వేల 77 మంది రైతలనుంచి 467 కేంద్రాల ద్వారా 5 లక్షల 85 వేల 661 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 1204.36 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. జిల్లాలో 2022-23 సంవత్సరమునకు రూ. 10 కోట్ల చిరుచేపల ఉత్పత్తి లక్ష్యం కాగా, రూ. 5కోట్ల ఉత్పత్తి సాధించామన్నారు. 986 చెరువుల్లో 458.77 లక్షల చేప పిల్లలను వదిలామని తెలిపారు. మత్స్యకారులకు వాహనాలు, వలలు తదితర సామగ్రి అందజేసినట్లు చెప్పారు. 2017-18లో గొల్ల కురుమలకు 10,722 గొర్రెల యూనిట్లు అందించామన్నారు. ఇందులో భాగంగా 75 శాతం సబ్సిడీపై రూ.140 కోట్లతో 2,25,162 జీవాలను పంపిణీ చేశామన్నారు.
పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలకు రూ. 136 కోట్ల 6 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కళాభారతి నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఇటీవల సీఎం కేసీఆర్ మరో రూ. 100 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. నీటి పారుదల శాఖ ద్వారా ప్రభత్వం రూ. 954.77 కోట్ల అంచనా విలువతో 15 నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన ఉపకాలువలను ఆధునికరించిందని తెలిపారు. రూ. 413 కోట్లతో 8 ప్రధాన ఉపకాలువలు, మిషన్ కాకతీయ ద్వారా రూ. 249 కోట్లతో 1270 చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. ప్రతి గడపకూ మిషన్ భగీరథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 2లక్షల 85 వేల 529 నల్లా కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. జిల్లాలో 2 లక్షల 77వేల 706 మందికి ఆసరా పథకం కింద రూ. 57.96 కోట్లు అందజేశామని తెలిపారు. 2023 నాటికి 15,753 సంఘాలకు రూ. 12227.62 కోట్లు లక్ష్యానికిగాను బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 926 కోట్ల మేర రుణాలు పంపిణీ చేశామని వివరించారు.
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్లు, కంటివెలుగు కార్యక్రమం, బస్తీ దవాఖానల ఏర్పాటుతోపాటు పీహెచ్సీల ద్వారా అందజేస్తున్న వైద్యసేవల్లో జిల్లా మొదటి స్థానంలో ఉన్నదన్నారు. విద్య, గృహ నిర్మాణ, రోడ్లు-భవనాలు, పంచాయతీ, షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, వెనుకబడిన తరగతులు, మహిళ, శిశు సంక్షేమం, ధరణి, పరిశ్రమలు, విద్యుత్, శాంతిభద్రతల పరిరక్షణ, విద్యుత్శాఖల్లో అనేక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్ విఠల్రావు, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, నగర మేయర్ దండు నీతూకిరణ్, జిల్లా జడ్జి కె.సునీత, సీపీ నాగరాజు, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి:కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్
కామారెడ్డి జిల్లాలో 74వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల భవనంపై కలెక్టర్ జితేశ్ పాటిల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులు, త్యాగమూర్తులతోపాటు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సాధించిన ప్రగతిపై కీలకోపన్యాసం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా అభివృద్ధికి అధికారులు తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించాలన్నారు. ముందుగా జిల్లా ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.