ఎదురుచూస్తున్న జిల్లావాసులు
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 6: జిల్లాలో ‘డయల్ యువర్ సీపీ’ కార్యక్రమం ద్వారా గతంలో ఎంతో మంది బాధితులకు న్యాయం జరిగింది. తమ పోలీసు స్టేషన్ పరిధిలో సమస్యలు, ఫిర్యాదులను డయల్ యువర్ సీపీకి విన్నవించడంతో వెంటనే పరిష్కారమయ్యేవి. దీంతో బాధితులు పోలీసు స్టేషన్తోపాటు జిల్లాకు వచ్చే అవసరం లేకుండా పోయేది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిల్లో ప్రజలకు సమస్యలు ఉంటే వారి వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. అయితే కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా తమ సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేవారు కాదు. కొన్ని సంఘటనల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళ్తే ప్రత్యర్థులు వారిని భయభ్రాంతులకు గురిచేసేవారు. దీంతో బాధితులు వారిలోవారే కుంగిపోయేవారు. మరి కొన్ని సందర్భాల్లో బాధితులు తమ సమస్యలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లభించేదికాదు. వారి సమస్యలను పట్టించుకునేవారు కాదు. తప్పు చేసిన వారు ఆర్థిక బలంతో తమ ఉనికిని చాటుకుంటూ బాధితులను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలూ ఉన్నాయి. వీటన్నీంటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికీ సరైన న్యాయం జరిగేలా ఎస్పీలు మొదలు కొని ఇటీవల బదిలీ అయిన సీపీ కార్తికేయ వరకు ‘డయల్ యువర్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి సోమవారం ఉదయ 10 నుంచి 11 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఉన్న 08462 232303 నంబర్ కు బాధితులు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకునేవారు. దీంతో బాధితుల ఫిర్యాదులపై సీపీ స్పందించి సంబంధిత పోలీసుస్టేషన్లకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసేవారు. దీంతో చాలా మంది బాధితులకు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో దొరకని న్యాయం సీపీ ద్వారా లభించడంతో హర్షం వ్యక్తం చేశారు. రెండేండ్ల క్రితం కొవిడ్ కారణంగా ‘డయల్ యువర్ సీపీ’ కార్యక్రమానికి బ్రేక్ వేశారు. ప్రజావాణి ద్వారా కూడా బాధితులకు సత్వర పరిష్కారం లభిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆర్టీసీలో సైతం ఇలాంటి కార్యక్రమమే చేపట్టారు. ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎం’ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని, పరిష్కారం చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నారు.
బాధితులకు సత్వర పరిష్కారం
జిల్లాలో ‘డయల్ యువర్ సీపీ’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని బాధితులు ఆశతో ఉన్నారు. తమకు పోలీసులు అండగా ఉన్నారనే భరోసా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుత సీపీ కేఆర్ నాగరాజు దృష్టి సారించి, డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.