బోధన్, మార్చి 31: గోదావరి, మంజీర తీరంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. బోధన్ నియోజకవర్గం ప్రగతి పథంలో సాగుతున్నది. దశాబ్దాల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు సంక్షేమానికి చిరునామాగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో తొమ్మిదేండ్లలో అద్భుత రీతిలో అభివృద్ధి చెందింది.
గోదావరి, మంజీరా నదులతో పరివ్యాప్తమై.. చైతన్యవంతులైన రైతులకు నిలయంగా ఉన్న బోధన్ నియోజకవర్గం.. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. స్థానిక శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ నేతృత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలులో బోధన్ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అనేక మతాలు, కులాలు, భాషలకు నిలయమైన బోధన్ నియోజకవర్గం దశ, దిశ తెలంగాణ ఆవిర్భావం అనంతరం మారిపోయింది. తొమ్మిదేండ్లలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మరోపక్క వేలాది కోట్ల రూపాయలను నియోజకవర్గం ప్రజలు, రైతులు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పొందుతున్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో బోధన్ మున్సిపల్తోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, ఉద్యానవనాల నిర్మాణాలు జరిగాయి. గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడంతో తాగునీటి సమస్య తీరిపోయింది. ‘పల్లె ప్రగతి’లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడంతో ఒకప్పుడు చెత్తాచెదారంతో అధ్వానంగా కనిపించే పల్లెలు.. ఇప్పుడు సుందరంగా కనిపిస్తున్నాయి.
గత పాలకులు రోడ్లతోపాటు వంతెనల నిర్మాణాలను నిర్లక్ష్యం చేశారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. గోదావరి, మంజీరా నదులు చెంతనే ఉండడం, వర్షాకాలంలో వాగులు, వంకలు దాటాలంటే ఇబ్బందులు పడడాన్ని గమనించిన ఆయన వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. విద్యారంగం అభివృద్ధి కోసం గురుకులాల ఏర్పాటుతోపాటు వాటికి సొంత భవనాలు ఉండేలా కృషి చేశారు. ఇక, వ్యవసాయరంగం అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. ప్రతి 5గ్రామాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక్కో రైతువేదికను నిర్మించారు. ఈ వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నీటిపారుదల రంగానికి సంబంధించి అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇలా.. ఒక్కటేమిటీ అన్నిరంగాల్లోనూ బోధన్ నియోజకవర్గం ప్రగతిపథంలో పయనిస్తున్నది. ఇక, సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పర్యవేక్షణలో పకడ్బందీగా అమలవుతుండడంతో ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు.
‘బ్యూటీఫుల్ బోధన్’ దిశగా..
బోధన్ పట్టణాన్ని బ్యూటీఫుల్గా తీర్చిదిద్దే కృషి జరుగుతున్నది. పట్టణం సుందరంగా కనిపించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు మున్సిపల్ సాధారణ నిధులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గజ్వేల్ మాదిరిగా బోధన్లో రూ.7.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు జరుగుతున్నాయి. రూ.19.76కోట్లతో పట్టణ ప్రగతి పనులు చేపట్టారు. టీయూఎఫ్ఐడీసీ రెండు దశల పనుల కింద రూ.23 కోట్లు ఖర్చుచేశారు. పట్టణంలో ప్రధాన రహదారులపై డివైడర్లను నిర్మించి, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేయడంతో రాత్రివేళల్లో రోడ్లన్నీ తళతళా మెరుస్తున్నాయి. పట్టణంలో చెత్త సేకరణకు పెద్దసంఖ్యలో వాహనాలను కొనుగోలు చేశారు.
చెక్డ్యామ్లు – ‘మిషన్ కాకతీయ’ పనులు
భూగర్భజలమట్టం పెరిగేందుకు బోధన్ నియోజకవర్గంలో ఆరు చెక్డ్యాములను రూ.26 కోట్లతో నిర్మించారు. ‘మిషన్ కాకతీయ’ కింద బోధన్ నియోజకవర్గంలోని చెరువుల్లో రూ.60 కోట్లతో పూడికను తీసి కట్టలను బలోపేతం చేశారు. దీంతో చెరువులు జలకళను సంతరించుకొని పంట పొలాలకు పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు నీటిపారుదల రంగానికి సంబంధించి బోధన్ నియోజకవర్గంలో ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లను ఖర్చుచేసింది.
నాడు లోలెవల్ -నేడు హైలెవల్ వంతెనలు..
నియోజకవర్గంలోని లోలెవల్ వంతెనలతో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన షకీల్ వాటిని హైలెవల్ వంతెనలుగా మార్చేందుకు కృషి చేశారు. ఫలితంగా రెంజల్ వద్ద మొండివాగు వంతెన, బోర్గాం వంతెన, బ్రాహ్మణ్పల్లి వాగు వంతెన, నవీపేట్ మండలంలోని జన్నేపల్లి, బోధన్ మండలంలోని కొప్పర్గ తదితర వంతెనలను నిర్మించారు. దీంతో వరదల్లో సైతం పల్లె ప్రజలు సురక్షింతంగా ప్రయాణాలు చేస్తున్నారు.
బోధన్కు ప్రభుత్వ జిల్లా దవాఖాన..
బోధన్ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపర్చడం కోసం తొమ్మిదేండ్లలో ఎంతో కృషి జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు సమకూరాయి. జిల్లాల విభజన ఫలితంగా బోధన్లోని కమ్యూనిటీ దవాఖాన జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ అయింది. దీంతో బోధన్ దవాఖానలో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో వంద పడకలుగా ఉన్న ఈ దవాఖానలో ఇప్పుడు 250 పడకల విస్తరణ పనులు నిర్వహించనున్నారు. దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ కిడ్నీ రోగుల అవసరాలను తీరుస్తుంది. ఇదే దవాఖానలో బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఈ దవాఖానకు గతేడాది కాయకల్ప అవార్డు లభించడం గమనార్హం. ఇటీవల బోధన్ పట్టణంలో తొలిబస్తీ దవాఖాన ఏర్పాటయ్యింది.
రూ.500కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనలు..
సుమారు రూ.500 కోట్లతో రోడ్ల విస్తరణ, భవనాలు, వంతెన పనులు చేపట్టారు. ఇంకా కోట్లాది రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయి. బోధన్, నిజామాబాద్లను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించడంతో రవాణా సౌకర్యం ఎంతో మెరుగుపడింది. ఈ పనులు ఆర్అండ్బీ. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత షకీల్.. రహదారుల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి సారించారు. బోధన్ నుంచి సాలూరా చెక్పోస్ట్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిని రూ.10 కోట్లతో ఫోర్లేన్ రోడ్డుగా విస్తరించారు. బోధన్ బైపాస్ రోడ్డును మరో రూ.10 కోట్లతో ఆధునీకరించారు. బోధన్ నుంచి మోస్రా రోడ్డు, పెగడాపల్లి నుంచి ఫకీరాబాద్ రోడ్డు… ఇలా అనేక ప్రధాన రహదారులకు మహర్దశ పట్టింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలో అనేక రోడ్లకు ఆధునీకరణ పనుల చేపట్టారు. పుష్కరఘాట్లు, రోడ్ల పనులు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజల ప్రశంసలను అందుకున్నది.
పేదలకు గురుకుల విద్య..
బోధన్ పట్టణానికి విద్యాకేంద్రంగా ఎంతో పేరుంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నియోజకవర్గంలో 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆరు గురుకులాలను ఏర్పాటుచేసింది. బోధన్లో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, రెంజల్, నవీపేట్ మండలాల్లో మరో రెండు గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు చక్కటి చదువును అందిస్తున్నాయి. ఇప్పుడీ పాఠశాలలన్నీ జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయి. బోధన్, రెంజల్, అమ్దాపూర్ల్లో జ్యోతి బాఫూలే బాలికల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. 60 సంవత్సరాల కిందట స్థాపించిన బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోగా, ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాన్ని సుమారు రూ.6 కోట్లతో నిర్మించారు. నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని రూ.3.5 కోట్లతో నిర్మించారు.
నిండుగా నిజాంసాగర్ కాలువలు
బోధన్ నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సీమాంధ్రుల పాలనలో నిజాంసాగర్ ప్రాజెక్ట్, కాలువలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. సింగూరు జలాల కోసం ఏటా ఆందోళనలు చేయాల్సివచ్చేది. తెలంగాణ ఆవిర్భావం.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈ పరిస్థితి మారిపోయింది. నీళ్ల కోసం జరిగిన ఉద్యమం ఫలించడంతో.. ఇప్పుడు నిజాంసాగర్ ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు సైతం నిండుగా పారుతున్నాయి. 2014 నుంచి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ నియోజకవర్గంలో రూ.77 కోట్లతో నిజాంసాగర్ కాలువలను ఆధునీకరించారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదలచేసినప్పుడల్లా.. కాలువలు పరవళ్లు తొక్కతూ ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీటిని అందిస్తున్నాయి.
బాసర రోడ్డు నిర్మాణం..
జ్ఞ్ఞాన సరస్వతీ కొలువైన బాసరకు వెళ్లాలంటే.. బోధన్ నియోజకవర్గం మీదుగా వెళ్లాల్సిందే.. గత పాలకుల హయాంలో ఈ రహదారి ఎంతో అధ్వానంగా ఉండేది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం జాన్కంపేట్ నుంచి బాసర వంతెన వరకు రోడ్డును రూ.50 కోట్లతో విస్తరించింది. ఇప్పుడా రోడ్డుపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు.