బీర్కూర్/ వేల్పూర్, మార్చి 31: ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు రాష్టస్థాయిలో ఉత్తమ పురస్కారాలు ప్రకటించగా.. శుక్రవారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి ప్రదానం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామం రాష్ట్రస్థాయిలో సామాజిక భద్రత విభాగంలో, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామం నీటి వినియోగం విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా రైతునగర్ సర్పంచ్ నాగేశ్వర్రావు, జీపీ కార్యదర్శి ప్రవీణ్, కుకునూర్ గ్రామ సర్పంచ్ విజయ, కార్యదర్శి ఆశ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కామారెడ్డి జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.