10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
సమీక్షా సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధ్యానం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో సోమవారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మార్కెటింగ్ శాఖ కొనుగోలుకేంద్రాలకు అవసరమైన గన్నీబ్యాగులు, తూకం కాంటాలు తదితర యంత్రాలను కేంద్రాలకు సరిపోయే సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ-గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1960, కామన్ వెరైటీకి రూ.1940 చెల్లించనున్నట్లు తెలిపారు. ఇన్చార్జీలు జారీచేసిన టోకెన్ ప్రకారమే నిర్ణీత తేదీన ధాన్యం తీసుకురావాలని, 17శాతంలోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈనెల 21న జిల్లా స్థాయి, 22న గ్రామ, మండలస్థాయి అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైస్మిలర్లు కడ్తా పేరుతో రైతుల వద్ద అధిక ధాన్యాన్ని తీసుకున్నా, హమాలీలు అధిక చార్జీలు వసూలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే రైతులు 18004256644, 08462 22 1085 నంబర్లకు ఫోన్ చేసి విష యం తెలుపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, ఇన్చార్జి డీసీవో వెంకటశ్వేరావు, డీఏవో గోవింద్, సం బంధిత అధికారులు పాల్గొన్నారు.