తొలి దశలో 407 పాఠశాలలకు రూ.170 కోట్లు
సుదీర్ఘ కాలంగా వేధిస్తోన్న ఇబ్బందులకు ఇక స్వస్తి
బృహత్తర కార్యక్రమంగా ‘మన ఊరు -మన బడి’ అమలు
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 1156 ప్రభుత్వ స్కూళ్లు
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపే మౌలిక సదుపాయాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :విద్యారంగానికి ఆదినుంచి పెద్దపీట వేస్తున్న రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం సర్కారు బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మనబడి’, ‘మన బస్తీ- మనబడి’ అమలుకు వేగిరంగా అడుగులు పడుతున్నాయి. తొలి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలోపే మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నివేదికలను రూపొందిస్తున్నాయి. నివేదికలను కలెక్టర్కు సమర్పిస్తారు. పరిశీలన అనంతరం నిధులు కేటాయిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 1,156 పాఠశాలలకుగాను మొదటి విడుతలో 407 బడులను ఎంపిక చేశారు. వీటిలో రూ.170 కోట్లతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించనున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా నిధులను వెచ్చించనున్నారు. మరోవైపు పాఠశాలల అభివృద్ధికి దాతలు సైతం విరాళాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాల అమలుకు కార్యాచరణ శరవేగంగా సిద్ధమవుతున్న ది. వచ్చే విద్యా సంవత్సరంలోపు ఎంపికైన పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో ఎంపికైన స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన కమిటీలు క్షేత్ర స్థాయి పర్యటనలు మొదలు పెట్టాయి. విద్యార్థుల అవసరాలు, పాఠశాలల్లో వసతుల కొరతను గుర్తించి చేపట్టాల్సిన పనులపై నివేదికలను రూపొందిస్తున్నారు. ఇందులో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు సమన్వ యం చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అడుగు పెట్టే సమయానికి 407 పాఠశాలలను కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిశ్చయించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నది.
తొలి దశలో 72,701 మంది విద్యార్థులకు మేలు
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి బృహత్తర కార్యక్రమానికి అడుగులు పడుతున్నాయి. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సదుపాయాల మెరుగునకు సంకల్పించిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. జిల్లాలో తొలి దఫా 407 పాఠశాలల్లో ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు. మొదటి విడుతలో మౌలిక వసతులు మెరుగవనున్నాయి. ఫలితంగా ఆయా పాఠశాలల్లో చదివే 72,801 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరం ఆరంభంలోపే నిర్దేశిత లక్ష్యాలు చేరుకునేలా సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1156 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్షా 10వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్లలో 72వేలకు పైగా విద్యార్థులున్నారు. అంటే దాదాపుగా 65శాతం మందికి తొలి దశలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు చేరబోతున్నాయి. బడుల బాగు కోసం నిజామాబాద్ జిల్లాకు తొలి దశలో రూ.170 కోట్ల వరకు నిధులు విడుదల కానున్నాయి.
శాస్త్రీయంగా స్కూళ్ల ఎంపిక
మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో తొలి విడుతలో శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం బడులను ఎంపిక చేసింది. పుష్కలంగా నిధులు మంజూరు చేసి స్కూళ్లను బాగు చేయాలనే ఆలోచనతో ఉన్న సర్కారు క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అనుసరించి మన ఊరు మన బడి కార్యక్రమానికి స్వీకరించారు. తక్కువ విద్యార్థులతో కొట్టుమిట్టాడుతున్న స్కూళ్లను తొలి దశకు తీసుకోలేదు. వీటిని మలి విడుతలో ఎంపిక చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ బడులు 11వందలకు పైగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అనేక సమస్యలు వేధిస్తున్నాయి. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పలుమార్లు సంబంధిత అధికారులు విన్నవించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన కార్యక్రమంతో దశల వారీగా బలోపేతం కానున్నాయి. తరగతి గదుల కొరత, ఫర్నిచర్, మూత్రశాలలు తదితర సదుపాయాలు కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని బడులకు ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అదనపు గదులు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. సకల హంగులతో ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు.
విరాళాలకు సముచిత స్థానం
తొలి విడుతలో ఎంపికైన స్కూళ్లలో సమస్యలు తెలుసుకునేందుకు విద్యా శాఖ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో, ఎంఈవో, ఇంజినీరింగ్, పంచాయతీ కార్యదర్శి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు చోటు కల్పించారు. ఆయా కమిటీలు పరిశీలించి నివేదికలను కలెక్టర్కు సమర్పిస్తారు. వాటిని పరిశీలించాక ఆమోదించి బడ్జెట్ కేటాయించనున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా నిధులు వెచ్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు దాతలు ముందుకు రావాలని కోరింది. ఎన్ఆర్ఐలు, ఇతరులు ఎవరైనా రూ.2లక్షల వరకు విరాళాలు ఇస్తే వారి పేర్లను తరగతి గది, రూ.10లక్షలకు పైగా విరాళాలు ఇస్తే ఆయా పాఠశాల ప్రధాన ముఖ ద్వారం ఎదురుగా నేమ్ బోర్డులను ఏర్పాటు చేసుకునే అకవాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అదనపు తరగతుల నిర్మాణం, డిజిటల్ గదులు, ప్రహరీ, వంట గది, గ్రీన్ చాక్ బోర్డు ఏర్పాటు, భోజన శాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్ సౌకర్యం కల్పించి కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దాలనేది సంకల్పం. తొలి విడుతలో ఎంపికైన బడులకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరంలో పనులు చేపట్టనున్నారు. ఇవన్నీ పూర్తయితే రాబోయే మూడేండ్లలో పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి.
పకడ్బందీగా మన ఊరు-మన బడి
ప్రభుత్వ స్కూళ్లకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు -మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం అమలులో భాగంగా మండల స్థాయి లో స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. తొలి విడుతలో విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఎంపిక చేసిన 407 పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించి, ఆయా బడుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించాం. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యులు, స్కూల్ హెచ్ఎం, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అవసరం ఉన్న పనులు గుర్తించి నివేదికలు ఇస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యే విధంగా పని చేస్తాం.
– సి.నారాయణ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్