కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌసల్య మల్టీ స్పెషాలిటీ
దవాఖానలో ప్రత్యేకాధికారుల స్ట్రింగ్ ఆపరేషన్
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయిన వైద్యుడు
కేసు నమోదు చేయాలని పోలీసులకు అధికారుల ఫిర్యాదు
కామారెడ్డి టౌన్, జూలై 15: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానను అధికారులు సీజ్ చేశారు. దవాఖాన వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న కౌసల్య మల్టీ స్పెషాలిటీ దవాఖానలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు రాష్ట్ర గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్యారోగ్యశాఖకు చెందిన ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగారు.
ఈ మేరకు ప్రత్యేకాధికారుల బృందం సభ్యులు గురువారం ఉదయం సాధారణ వ్యక్తుల మాదిరిగా ఓ గర్భిణిని తీసుకొని కౌసల్య మల్టీ స్పెషాలిటీ దవాఖానకు వెళ్లారు. లింగ నిర్ధారణ కోసం దవాఖాన వైద్యుడు సిద్ధిరాములుకు రూ.ఆరువేలు చెల్లించారు. సదరు వైద్యుడు ఆపరేషన్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం అధికారి డాక్టర్ సూర్యశ్రీ విలేకరులతో మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దవాఖానలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. దవాఖానలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి అర్హత లేకున్నా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం ఈ దవాఖానకు సంబంధించి పూర్తి వివరాలు జిల్లా వైద్యాధికారికి అందించామన్నారు. దవాఖాన వైద్యుడు సిద్ధిరాములను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
దవాఖాన సీజ్
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కౌసల్య మల్టీస్పెషాలిటీ దవాఖానను సీజ్ చేసినట్లు కామారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సదరు దవాఖానలో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్కు రిజిస్ట్రేషన్ లేదన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దవాఖానను కామారెడ్డి తహసీల్దార్, ఇతర సిబ్బందితో కలిసి సీజ్ చేయించినట్లు వివరించారు. దవాఖాన యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.