కామారెడ్డిరూరల్, ఏప్రిల్ 11 : ఉమ్మడి రా ష్ట్రంలో అభివృద్ధికి దూరమైన పల్లెలు ప్రస్తుతం సకల సౌకర్యాలతో నందనవనాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి గ్రామం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న క్యాసంపల్లి గ్రామానికి మూడు వైపుల నుంచి రోడ్డు మార్గం ఉంది. క్యాసంపల్లి నుంచి సిరిసిల్ల రోడ్డు, నర్సన్నపల్లి రోడ్డు, పాఠశాల సమీపంలో నుంచి కామారెడ్డి వెళ్లే మూడు దారుల్లో మొక్కలు నాటి వాటి చుట్టూ కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరిగి హరితదారులను తలపిస్తున్నాయి. అలాగే మంకీ ఫుడ్ కోర్టులో గతంలో నాటిన కొన్ని మొక్కలు చనిపోవడంతో వాటి స్థానంలో ప్రస్తుతం కొత్తవి నాటిస్తున్నారు.
వంద శాతం పూ ర్తయిన ప్రగతి పనులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు క్యాసంపల్లిలో వంద శాతం పూర్తయ్యాయి. అందులో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు ఇప్పటికే నాటిన మామిడి, జామ చెట్లకు పండ్లు కూడా కాస్తున్నాయి. అలాగే వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, మంకీ ఫుడ్ కోర్టు పనులు వంద శాతం పూర్తయ్యాయి. అలాగే గతంలో 3 ఎకరాల్లో నాటిన కమ్యూనిటీ ప్లాంటేషన్లోని మొక్కలకు సకాలంలో నీటిని అందిండంతో అవి ప్రస్తుతం ఏపుగా పెరగడంతో పాటు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.