నిజాంసాగర్, ఫిబ్రవరి 12: నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామశివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం వైభవంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే కార్యక్రమం మొదటి రోజు గ్రామం నుంచి బ్యాండు మేళాలతో వేద పండితులు సంజీవ్రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మైసమ్మ తల్లి, జంట నాగుల విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి-దుర్గారెడ్డి దంపతులతో ప్రత్యేక పూజలు, హో మం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాని, ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని, తోగుట పీఠాధిపతి మాదవానంద సరస్వతి స్వామి రానున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, నాయకులు మహేందర్రెడ్డి, రమేశ్, ప్రవీణ్, అనిల్, సుభాష్ తదితరులు ఉన్నారు.
బ్రాహ్మణపల్లిలో..
తాడ్వాయి, ఫిబ్రవరి 12 : మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాత గ్రామపంచాయతీ నుంచి శివపంచాయతన నవగ్రహ హనుమాన్ విగ్రహాలను వాహనంలో పెట్టి గ్రామంలో ఊరేగించారు. కొత్తగా నిర్మించిన ఆలయం వరకు డప్పువాయిద్యాలతో గ్రామస్తులు విగ్రహాలను తీసుకెళ్లారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు మూడు రోజులపా టు కొనసాగుతాయన్నారు. మొదటి రోజు స్థాపిత దేవతల జపములు,అగ్ని ప్రతిష్ఠ, పవలింపు కార్యక్రమాల్లో గ్రామస్తులు, ఇతర గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొని పూజలు చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
మాలోత్ సంగ్యానాయక్ తండాలో..
లింగంపేట, ఫిబ్రవరి 12 : మండలంలోని మాలోత్ సంగ్యానాయక్ తండాలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శనివారం గణపతి పూజతో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభించారు. మూడు రోజులపాటు కార్యక్రమాలు కొనసాగుతాయని సర్పంచ్ బన్నీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు సామ్ని, తండావాసులు పాల్గొన్నారు.