కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా వంద మంది విద్యార్థులకుపైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. కామారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. దళిత బంధు పథకం కోసం నియోజకవర్గానికి ఒక రిసోర్స్ పర్సన్ను నియమించాలన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల వివరాలను అధికారులు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 18 వరకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత గోడ ప్రతులను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఆర్డీవో వెంకట మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మం దిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదుల ను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఆర్డీవో వెంకటమాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, కలెక్టరేట్ ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి మొత్తం 34 ఫిర్యాదులు వచ్చాయి.