అన్ని సదుపాయాలు, ఆహ్లాదకర వాతావరణం
మన ఊరు- మన బడితో మరింత అభివృద్ధి
పిట్లం, ఫిబ్రవరి 14:వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కానున్నది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పడనున్నది. పిట్లం మండలంలోని మద్దెల్ చెర్వు ప్రాథమికోన్నత పాఠశాలలో ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం కొనసాగుతున్నది. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం ప్రారంభించనున్న మన ఊరు – మన బడితో ఈ పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న మన ఊరు-మనబడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభంతోపాటు సకల సౌకర్యాలు కల్పించనుండడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెలచెరువు ప్రాథమికోన్నత పాఠశాల ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా తరగతి గదులను తీర్చిదిద్దారు. పాఠశాల గోడలపై రంగురంగుల చిత్రాలతో ముస్తాబు చేశారు. దాతల తోడ్పాటుతో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్దెలచెరువు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ ప్రహరీ, వివిధ రకాల పెయింటింగ్స్, గోడలపై జాతీయ నాయకుల చిత్రాలు వేయించారు. విద్యార్థులు బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాలలోఉపాధ్యాయులు ప్రైవేటుకు దీటుగా బోధనను కొనసాగిస్తున్నారు. గతంలో ఈ పాఠశాలలో 80కి మించని విద్యార్థులు ప్రస్తుతం 1 నుంచి 7వ తరగతి వరకు 120మంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మద్దెలచెరువు గ్రామానికి చెందిన ఏలూరి విఠల్రెడ్డి రూ.2లక్షలతో సరస్వతి విగ్రహం, ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. వారధి స్వచ్ఛంద సంస్థ పాఠశాలను దత్తత తీసుకొని రూ.70వేలతో అభివృద్ధి పనులు చేయించింది. గొల్ల రమేశ్ అనే వ్యక్తి రూ.41 వేలతో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, టై, బెల్టు, షూలు కొనుగోలు చేసి ఉచితంగా అందించారు.
సర్కారు బడే బాగుందంటున్నారు
ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపుతో చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపించేవారు. కూలీ పనులు చేసుకునేవారు కూడా ఫీజుల భారం మోస్తూ చదివిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన బోధన అందుతుంది. ఇంగ్లిష్ మీడియం కూడా ప్రారంభించి విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి ప్రారంభిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలే బాగున్నాయంటున్నారు.
అన్నివర్గాలకు ఆంగ్ల విద్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయించడం హర్షణీయం. దీంతో అన్నివర్గాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ బోధన జరుగుతుంది. ఇంతకాలం పేద, మధ్యతరగతి పిల్లలకు ఆంగ్ల విద్య అందలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
–గోపాల్సింగ్, సీఆర్పీ