కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని సూచించారు. కొవిడ్ కేసులు ఇతర దేశాల్లో పెరుగుతున్నందున పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.