ఎల్లారెడ్డి, ఆగస్టు 23: సాగు నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మార్పువైపు అడుగులు వేస్తున్నారు. నీటి వసతి ఎక్కువగా ఉండడం తో చేపల చెరువులు ఏ ర్పాటు చేసుకొని మంచి ఆదాయం కోసం కష్టపడుతున్నారు. భూమిపై వ్యవసాయం చేయడమే తెలిసిన రైతులు కొత్తగా ప్రభుత్వ సాయంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపలు చెరువులు తవ్వి, వాటిలో చేప పిల్లలు పెంచి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మాంసాహారంలో అన్నింటి కన్నా మిన్నగా ప్రజలు ఇష్టపడుతున్న చేపల పెంపకంలో జిల్లా రైతులు ముందుంటున్నారు. అధికారుల సహకారంతో మంచి లాభాలు వస్తున్నాయని ఆనందపడుతున్నారు. ఎకరం చేపల చెరువుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెడితే ఏడాది కాలంలోనే తిరిగి మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట, బీర్కూర్, బాన్సువాడ, మాచారెడ్డి మండలాల్లో చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు.
జిల్లాలో వందకు పైగా చేపల చెరువులు..
కామారెడ్డి జిల్లాలో పలువురు రైతులు నీలి విప్లవం వైపు అడుగులు వేస్తున్నారు. గతానికి భిన్నంగా చేపల పెంపకం కోసం చెరువులు తవ్వి వాటిలో పిల్లలను వేసి పెంచుతున్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద ఓ రైతు రెండు చెరువులను ఏర్పాటు చేసి పిల్లలను వేశాడు. జంగమాయపల్లి గ్రామంలో మరో రైతు మూడు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు చెరువులు తవ్వి వాటిలో పిల్లలను పెంచి విక్రయించే పనిలో ఉన్నాడు. ఆ రైతు గతేడాది కాలంగా రెండు పంటలు తీసి మంచి ఆదాయం పొందాడు. లింగంపేట మండలంలోని మెంగారం గ్రామంలో మరో రైతు చేపల చెరువు తవ్వి పిల్లలను వేశారు. బీర్కూర్, బాన్సువాడ, మాచారెడ్డి మండలాల్లో సైతం రైతులు చెరువులను ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు చేపల చెరువులు ఉన్నాయని సమాచారం. వీటికి తోడు చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద 25 మీటర్లు పొడవు, వెడల్పుతో పాంపాండ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఐదు నుంచి ఆరు అడుగుల లోతుతో ఏర్పాటు చేసిన వీటిలో చాలా మంది రైతులు చేపలను పెంచుతున్నారు.
రెండు లక్షల ఆదాయం..
మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉండడంతో వాటి పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో చేపపిల్లలు వేస్తే ఏడాదికి 40వేల వరకు ఆదాయం వస్తుంది. ఎకరం విస్తీర్ణంలో చేపల చెరువు ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు నుంచి మూడు పంటలు తీస్తే కనీసం రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఎకరం చేపల చెరువు ఏర్పాటుకు లక్ష వరకు ఖర్చు అవుతుంది. చేప పిల్లలు వేసి వాటికి ఆరు నెలల పాటు మంచి దాణా పెట్టి అవసరమైన మందులు వాడితే రూ.50 నుంచి 60 వేల వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలల తర్వాత వాటిని విక్రయిస్తే మూడు నుంచి నాలుగు టన్నుల చేపలు వస్తాయి. వీటిని బహిరంగ మార్కెట్లో రూ.60కి కిలో విక్రయిస్తే లక్షా80వేల నుంచి 2 లక్షల 40 వేల వరకు వస్తాయి. వీటిలో 60వేల ఖర్చులు పోతే కనీసం లక్షకు పైగానే మిగులుతుంది. ఆరు నెలలకు ఒక పంట తీసినా ఏడాదిలో కనీసం రెండు లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
చేపల పెంపకంతో మంచి ఆదాయం..
వ్యవసాయంతో పోల్చితే చేపల పెంపకంతో మంచి ఆదాయం వస్తుంది. చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తాం. చేపలు పెంచడంలో మెలకువలు నేర్పుతాం. చేపల రకాల మేరకు మంచి లాభాలు వస్తాయి.
– వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి.
మూడు రకాల చేపలను పెంచుతున్నా..
మూడు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు చెరువులను ఏర్పా టు చేశాను. వాటిలో గత సంవత్సరం బంగారు తీగ, రవటా, బొచ్చ రకాల్ని పెంచా ను. మంచి దిగుబడి వచ్చింది. ఈ సా రి చేప పిల్లలను విక్రయించేందుకు వాటిని పెంచుతున్నాను.
– వెంకట్రెడ్డి, రైతు, జంగమాయపల్లి.