బండి సంజయ్, అర్వింద్ తీరుకు నిరసనగా కమలం పార్టీకి గుడ్ బై
బీజేపీ ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇస్తున్న గులాబీ పార్టీ నేతలు
ఉభయ జిల్లాలోనూ సంస్థాగతంగా బలోపేతమైన టీఆర్ఎస్
నిజామాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతుండడంతో ఉత్సాహం రెట్టింపు అవుతున్నది. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా కార్యవర్గాల కూర్పుతో పార్టీ బలోపేతమైంది. గులాబీ అధినేత కేసీఆర్ తాజాగా జిల్లాలకు అధ్యక్షులను నియమించడంతో కొంగొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి దూకుడుకు బీజేపీ విలవిల్లాడుతున్నది. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత టీఆర్ఎస్లోకి వలసలు పెరగడం విశేషం. ఇదిలా ఉండగా నిజామాబాద్ నడిబొడ్డున ఎల్లమ్మగుట్ట ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. భవనాన్ని త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.
రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో అతి పెద్ద పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే అవతరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ జాతీయ పార్టీలకు దీటుగా కార్యకర్తలను కలిగి ఉంది. గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో వివిధ కమిటీల మార్పులు, చేర్పులు, నూతనంగా కార్యవర్గాల కూర్పు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలాఖరు వరకు జోరుగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న తొలి నాళ్ల నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో నేటికీ టీఆర్ఎస్ పార్టీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలు పత్తా లేకుండా పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాల కూర్పు తో బలోపేతమైంది. గులాబీ అధినేత కేసీఆర్ తాజా గా జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించడంతో శ్రేణుల్లో కొంగొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ నిర్వహణ వ్యవహారాలు ఇక నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టడంతో గులాబీ దళంలో ఉత్సాహం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎ మ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి దూకుడుకు బీజేపీ విలవిల్లాడుతున్నది. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత టీఆర్ఎస్లోకి వలసలు పెరగడం విశేషం.
చేరికలతో జోష్…
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంతో కార్యకర్తల్లో జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ, మండల, జిల్లా కమిటీల కూర్పుతో సంస్థాగతంగా బలపేతమైన అధికార పార్టీ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడంలో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందిన టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి రాకతో చేరికలు ఊపందుకున్నాయి. వరుసగా బీజేపీ నుంచి గులాబీ పార్టీకి భారీగా చేరికల పర్వం నడుస్తోంది. బీజేపీలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తీరుకు నిరసనగా బీజేపీని వీడుతున్నారు. గడిచిన మూడు వారాలుగా వరుస పెట్టి చాలా మంది గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ మండలాలకు చెందిన బీజేపీ స్థానిక ప్రజా ప్రతినిధులే ఎక్కువగా ఉండడం విశేషం. పసుపు బోర్డు అంశాన్ని ప్రశ్నించినందుకు రైతులపై దాడి చేసిన కారణంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరును నిరసిస్తూ నందిపేట ఎంపీటీసీ వారం క్రితమే కారెక్కారు. తాజాగా ఆర్మూర్ మండలం చేపూర్ ఎంపీటీసీ సైతం గులాబీ కండువా వేసుకున్నారు. రెంజల్ మండలం నీలా ఎంపీటీసీ సైతం బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇలా వరుస పెట్టి బీజేపీ కార్యకర్తలుగా కొనసాగుతున్న వారంతా గుడ్బై చెబుతూ టీఆర్ఎస్లోకి వచ్చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీజేపీ నేతలు చేజారి పోతుండడంతో సొంత పార్టీలో అర్వింద్ తీరుపై చర్చ కొనసాగుతున్నదని సమాచారం.
5లక్షలకు పార్టీ బలగం…
కాంగ్రెస్, బీజేపీల కన్నా మిన్నగా టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి టీఆర్ఎస్కు కంచుకోట. ఉద్యమ కాలం నుంచి అనేక ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఈ ప్రాంత బిడ్డలంతా ఏకపక్షంగా పట్టం కట్టినవారే. అదే అభిమానాన్ని నేటికీ గులాబీ పార్టీ పై ప్రజలంతా చూపిస్తుండడంతో జాతీయ పార్టీల కన్నా అనేక రెట్లు ఎక్కువగా టీఆర్ఎస్ బలం పెంచుకున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఊహించిన దాని కన్నా ఎక్కువగానే కార్యకర్తల బలాన్ని సొంతం చేసుకున్నది. నియోజకవర్గానికి 50వేల మెంబర్షిప్ చొప్పున ఉమ్మడి జిల్లాలో దాదాపు 5లక్షల మందికి పార్టీ బలగం చేరింది. కాంగ్రెస్, బీజేపీలకు మండల స్థాయిలో బలం అంతగా లేదు. కాషాయ జెండా పట్టుకున్న వారంతా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ బలం సన్నగిల్లింది. ఏటా టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరుగుతున్నది. గతేడాది అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామానికి కా ర్యవర్గాన్ని, మండల స్థాయిలోనూ కీలకమైన వ్యక్తుల కుపార్టీ పదవులను అప్పగించారు.టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలకు సైతం కా ర్యవర్గాల కూర్పుతో బలం మరింతగా పుంజుకున్నది.
ప్రారంభానికి సిద్ధంగా మినీ తెలంగాణ భవన్…
నిజామాబాద్ నడిబొడ్డున ఎల్లమ్మగుట్ట ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. గత దసరా నాటికే నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న మినీ తెలంగాణ భవన్ను త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి మీటింగ్లతో పాటుగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు, ఇతరత్రా పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మినీ తెలంగాణ భవన్ను తీర్చిదిద్దారు. మినీ తెలంగాణ భవన్గా పిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవన నిర్మాణానికి అధిష్టానం రూ.60లక్షలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా డిజైన్ను రూపొందించి పార్టీ నిర్మాణాలను చేపట్టింది.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నమూనాను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆమోదించారు. మినీ తెలంగాణ భవన్ వైశాల్యం 8,352 చదరపు అడుగుల మేర ఉంది. ఇందులో వివిధ విభాగాలను విభజించారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విస్తీర్ణం 2,537 చదరపు అడుగులుగా ఉంది. దీని పక్కనే మీటింగ్ హాలును నిర్మించారు. మీటింగ్ హాలు వైశాల్యం 4712 చదరపు అడుగులుగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా గులాబీ పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.
ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పోయింది…
భారతీయ జనతా పార్టీ అంటేనే అదో పెద్ద ఝూటా పార్టీగా మారింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. మోదీ మాటలే తప్ప చేతల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించదు. ఇది యావత్ దేశ ప్రజలు గుర్తించారు. బీజేపీ మోసానికి పసుపు బోర్డు హామీ ఒక్కటే ఉదారహణ. 5 రోజుల్లో ఇస్తామని చెప్పిన పసుపు బోర్డును పట్టించుకోని ఘనాపాఠీలు వీళ్లు. అందుకే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతోనే బీజేపీకి గుడ్ బై చెప్పి చాలా మంది ప్రజాప్రతినిధులు, వారి అనుచరులంతా టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,నిజామాబాద్