నిజాంసాగర్/ గాంధారి/లింగంపేట/ తాడ్వాయి, ఫిబ్రవరి 14: ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఉన్న బేడీల మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేకపూజా కార్యక్రమాలు, హోమం, ఒడిబియ్యం, బోనాల సమర్పణ, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వేదపండితుడు సంజీవ్రావు ఆధ్వర్యంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతిదుర్గారెడ్డి దంపతులు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. గోర్గల్, మాగి, గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కుటుంబీకులతోపాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం దాతలను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్గౌడ్, సర్పంచులు అంజయ్య, అంబవ్వ, నాయకులు రమేశ్, సత్యనారాయణ, ప్రవీణ్, కిషన్, మహేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే..
నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఉన్న బేడీల మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని అనుసరించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ నిర్వాహకులు సన్మానించారు.
గాంధారి మండలకేంద్రంలో విశ్వబ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలు, బ్రహ్మం గారి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో యజ్ఞహోమాలను నిర్వహించి, బ్రహ్మంగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వడ్ల బాలరాజు, కమ్మరి నాగరాజు, కమ్మరి స్వామి, కిష్టయ్య, సాయిలు, హన్మాండ్లు, వడ్ల సురేశ్, సంజీవులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని ఎక్కపల్లి తండా శివాలయంలో శివపార్వతులు, నవగ్రహాల ప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఏలేటి శ్రీలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, సర్పంచ్ బన్నీ, ఎంపీటీసీ సభ్యురాలు సామ్ని తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లిలో శివపంచాయతన నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగిన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. వేదపండితుల ఆధ్వర్యంలో విగ్రహాలు, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠాపనతో పాటు పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు, దాతలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా.. వీడీసీ సభ్యులు సన్మానించారు.