మాచారెడ్డి,ఆగస్టు 26 : కారుకు ఎదురే లేకుండా సాగిపోయేలా పది గ్రామాల ప్రజలు ఉత్సాహాన్నిచ్చారని, సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడం అద్భుతమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు ఆధ్వర్యంలో ముఖ్యనాయకులు,కార్యకర్తలు హైదరాబాద్లో తన నివాసంలో కల్వకుంట్ల కవితను శనివారం కలిసి తీర్మానప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉన్నదన్నారు.
గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. నిజామాబాద్ బిడ్డగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని, అందరిలాగే తనకూ ఉత్సాహం ఉన్నదని చెప్పారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న కామారెడ్డిలో భారీ సమావేశం నిర్వహించనున్నామని, తాను కూడా ఆ సమావేశంలో పాల్గొంటానని వెల్లడించారు. కామారెడ్డి ప్రజలు పౌరుషాన్ని చూపించేందుకు ఇదే సమయమని స్పష్టం చేశారు. గజ్వేల్ కన్నా ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపించాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధికి అవార్డులు సైతం ఇస్తున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ-22 ద్వారా కామారెడ్డికి నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, మఠం భిక్షపతి, మేడే రాజీవ్సాగర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్చంద్రం, చంద్రునాయక్, అరవింద్, రామ్మోహన్, శ్రీనివాసాచారి, బుస శ్రీనివాస్, సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డి పాల్గొన్నారు.