విద్యానగర్, నవంబర్ 29:పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపడం కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం సిలబస్ పూర్తవగా, డిసెంబర్ నాటికి 100శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి స్లిప్ టెస్టులు నిర్వహించి విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు మన ఊరు – మనబడి ద్వారా కార్పొరేట్కు దీటుగా విద్యను అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో జిల్లా విద్యాశాఖ అధికారులు, యంత్రాంగం ముందుకెళ్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మంచి ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తూ.. ఇందుకోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న 186 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను చేపడుతున్నారు. ఇందుకోసం అదనపు తరగతులను నిర్వహిస్తూ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 293 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 293 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తం 12,783 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. జిల్లాలో 186 ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలుండగా, 19 కేజీబీవి, 13 తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 2 ఎయిడెడ్, 6 మైనార్టీ వెల్ఫేర్, 54 ప్రైవేటు, 4 మహత్మాజ్యోతిబా ఫూలే వెల్ఫేర్, 3 తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి.
డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక తరగతులు..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు చేపడుతున్నది. ప్రతి రోజూ సబ్జెక్టుల వారీగా తరగతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన చేయాలని నిర్ణయించింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల
వరకు సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు అవసరం ఉన్న మేరకు ఎక్కువ సమయాన్ని తీసుకోనున్నారు. నాలుగేండ్లుగా పదో తరగతి విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం సమయాన్ని కేటాయిస్తూ.. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ప్రధానంగా గణితం, ఇంగ్లిష్, సైన్సు సబ్జెక్టులకు ప్రత్యేకంగా అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. తుది పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు.
ప్రత్యేక ప్రణాళికతో..
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. వందశాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ముందుకు సాగుతున్నాం. ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి