నిజామాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, లాభాలు తెచ్చే పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నది. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగువైపు రైతులను మళ్లిస్తున్నది. ఇందుకోసం వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండడం.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూత నిస్తుండడంతో ఆయిల్ పామ్ సాగుకు అన్నదాతలు ఉత్సాహం చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 50వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 1745.74 ఎకరాల్లో మొక్కలు నాటారు. మిగతా రైతులు కూడా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆయిల్ పామ్ సాగుపై జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నది. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతు లు పంట మార్పిడి వైపునకు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించిం ది. ఒకే రకమైన పంటల సాగుతో నిస్సారమైన భూమిని పునరుత్తేజం కల్పించేందుకు విభిన్న పంటల సాగు ఇప్పుడు అత్యవసరంగా మారింది. దీం తోపాటు ఇతర పంట సాగుతో రైతు ల ఆదాయ వృద్ధి రేటును పెంచేందుకు ప్ర యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగును రాష్ట్ర మంతటా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోనూ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 50వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేసేందుకు ప్రణాళికలను రూపొందించి అందుకు అనుగుణంగా రైతులను ప్రోత్సహించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భా గంగా 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1745. 74 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా ఆయిల్పామ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు ప్రక్రియపై ఆద ర్శ రైతులు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
వైవిధ్యమైన సాగు…
నూనె గింజల ఆధారిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగును భారీగా పెంచేందుకు సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ప్రణాళికలు సేకరించాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ప్రభుత్వ సూచనలతో నిజామాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని కార్యాచరణను సిద్ధం చేశారు. సాగుకు అంగీకారం తెలిపిన వారిని గుర్తించి వారికి శిక్షణ కూడా ఇప్పించారు. పంట సాగుపై అవగాహన కల్పించడంతో ఔత్సాహికుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలో ఆయిల్పాం సాగుపై ఏడాదిన్నర కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్ మండలం చేపూర్ శివారు నర్సరీలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలాల వారీగా రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఉద్యాన శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా బృందాల వారీగా రైతులను ఖమ్మం జిల్లాకు పంపించి అవగాహన సైతం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న తరుణంలో రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా యంత్రాంగం పాటు పడుతోంది.
రైతుకు శాపంగా మారిన మోదీ తీరు
రైతుకు మేలు చేస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం చేసుకునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు అందిస్తోన్న ప్రోత్సాహం శూన్యం. పైగా ఆయిల్పామ్ విత్తన దిగుమతులపై దిగుమతి సుంకం పేరుతో భారీగా వడ్డన వేస్తుండడంతో రైతులు ఆక్షేపిస్తున్నారు. ఓ వైపు రాయితీలంటూ ప్రకటనలు చేస్తూనే మరోవైపు దొడ్డి దారిలో పన్నుల రూపంలో వాతలు పెట్టడం ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. విత్తన మొలకల దిగుమతులపై కేంద్రం ఇటీవల దిగుమతి సుంకాన్ని ఐదు శాతం నుంచి 30 శాతానికి పెంచడంతో ఆయిల్పామ్ మొక్క ధర అమాంతం పెరిగి పోయింది. మోదీ ప్రభుత్వ నిర్ణయం.. మధ్య తరగతి రైతులకు శాపంగా మారింది. బడా రైతులు మాత్రమే ఆయిల్ పామ్ మొక్కలు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఏటా లక్షలాది విత్తనాలను మలేషియా, కోస్టారికా, అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడ నుంచి తెచ్చిన మొలకలను దేశంలో పాలిథిన్ బ్యాగుల్లో ఉంచి మొక్కలుగా పెంచుతారు. ఏడాదిపాటు పెంచాక రైతులకు సరఫరా చేస్తారు. దిగుమతి సుంకం పెంపుతో ఇతర దేశాల నుంచి లక్ష విత్తనాలు దిగుమతికి చేసుకోవడానికి గతంలో రూ.2.75 లక్షలు ఖర్చు కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నాలుగైదు రెట్లు పెరుగనుండడం గమనార్హం.
మార్పు మంచిదే…
వ్యవసాయక జిల్లాగా పేరొందిన నిజామాబాద్లో వరి సాగు విస్తీర్ణం భారీగా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుతో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో ఇతర పంటలు పండించాలనుకునే వారు ఆయిల్పామ్ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. కొత్త పంట కావడంతో సాగు యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అవసరాలపై రైతుల్లో సందేహాలు ఉన్నాయి. సాగుదారులను ఖమ్మం తీసుకెళ్లి అక్కడి రైతుల అనుభవాలను వివరించేలా చూడాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఉద్యానవన శాఖను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపుగా 75శాతం వరి పంటవైపే రైతులు దృష్టి పెడుతున్నారు. పుష్కలంగా నీటి వనరులు అందుబాటులో ఉండడంతో ఇతరత్రా పంటల సాగుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మార్పు కోరుకునే వారికి కూరగాయలు, అపరాల సాగుతో పాటుగా ఆయిల్పామ్ వంటి నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిశ్చయించింది. ఇప్పటికే రాయితీలు కూడా ప్రకటించింది. ఉద్యాన శాఖ అధికారులు సైతం జిల్లాలో ఔత్సాహికులైన 1500 మంది రైతులను గుర్తించి శిక్షణ కూడా అందివ్వగా తొలి విడుతలో వీరిలో కొంత మంది 1745.74 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టారు.