ఎల్లారెడ్డిలోని పాఠశాలలు, ప్రభుత్వ దవాఖాన తనిఖీ
ఎల్లారెడ్డి రూరల్, జూన్ 22 : కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు రూ. కోటీ 42 లక్షల నిధులు మంజూరు కాగా.. 8 తరగతి గదులు, కిచెన్షెడ్, ప్రహరీ, డైనింగ్ హాల్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి గదులను పార్టీషన్లుగా చేసి తరగతులకు వినియోగించుకోవాలని, మొదటి అంతస్తును డార్మెటరీకి కోసం వాడుకోవాలని సూచించారు. మైనారిటీ గురుకులానికి ప్రత్యేకంగా గేట్ను ఏర్పాటుచేయాలని, స్కూల్ ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు. కేజీబీవీలో కిచెన్షెడ్, కంప్యూటర్ ల్యాబ్, గిరిజన బాలికల గురుకులంలో కిచెన్షెడ్, విద్యుద్దీకరణ, సెప్టిక్ ట్యాంకు, కాంపౌండ్వాల్ నిర్మాణం తదితర వాటిని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంఈవో వెంకటేశం, తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు ..
ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది, ఖాళీ పోస్టుల వివరాలను సేకరించారు. వార్డుల్లో తిరిగి పేషెంట్లతో మాట్లాడారు. డెంటల్ వింగ్ను పరిశీలించి ఎక్విప్మెంట్ వాడకంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం నిర్మిస్తున్న గదిని పరిశీలించారు. అనంతరం దవాఖాన వెనుక భాగంలో ఉన్న సబ్ సెంటర్ను తనిఖీ చేశారు. చిన్నారులకు సరైన సమయంలో టీకాలను ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో యోగా షెడ్ను నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, రోగులు సర్కారు దవాఖాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్, అధికారులు పాల్గొన్నారు.