ఎల్లారెడ్డి రూరల్, మార్చి 3: పురాతన బావుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కోదండరామాలయం, గోపాలస్వామి ఆలయాల్లో ఉన్న పురాతన బావుల పరిశుభ్రత పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను అందరూ రక్షించుకోవాలన్నారు. బావులు జలకళను సంతరించుకుంటే పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి వినియోగంలోకి తేవాలన్నారు.
బావుల చరిత్రను తెలిపే బోర్డును ఏర్పాటు చేయాలని, బావుల చుట్టూ గ్రీనరీని పెంచాలన్నారు. ఎల్లారెడ్డి పరిసరాల్లో ఏవైనా చారిత్రక విగ్రహాలు, శిల్పసంపద దొరికితే వాటిని తీసుకొచ్చి బావుల చుట్టు పక్కల ఏర్పాటు చేయాలన్నారు. గార్డెనింగ్ చేసి సాయంత్రం వేళల్లో కూర్చుండేందుకు వీలుగా బెంచీలను పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ అల్లం మహేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, గిర్దావర్ శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు సిద్ది రాజులు, సిద్ధి శ్రీధర్, సిద్ధి చంద్రప్రకాశ్, సిద్ధి భైరు, ఎస్సై బొజ్జ మహేశ్ తదితరులు ఉన్నారు.