నందిపేట్, డిసెంబర్ 24: మున్నూరుకాపుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం నిర్మాణం పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి శనివారం నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరుకాపు కల్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించారు.
పద్మశాలీ కల్యాణ మండపానికి భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్-ఆర్మూర్ మెయిన్ రోడ్డుపై పలుగుట్ట ఆశ్రమానికి సమీపంలో నందిపేట్లో ఐదెకరాల స్థలంలో నిర్మిస్తున్న మున్నూరుకాపు కల్యాణ మండపం పనులకు ఇప్పటికే రూ.2కోట్ల 25 లక్షలు మంజూరు చేశామని, అవసరమైతే మరో రూ.కోటి ఇస్తానన్నారు. ట్రాన్స్ఫార్మర్ పనులకు రూ.4.74 లక్షలు ఇచ్చామని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, కాంపౌండ్వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటర్ట్యాంక్ పనులు రేపటి నుంచి ప్రారంభమవుతాయని జీవన్రెడ్డి తెలిపారు.
15 రోజుల్లోగా పనులు పూర్తి చేసి జనవరి 18 నుంచి ఉచితంగా పెళ్లిళ్లు జరిగేలా మున్నూరుకాపు సోదరులకు ఈ కల్యాణ మండపాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అయ్యప్ప స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అమ్మవారి ఆలయం సీసీ రోడ్డుకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు జీవన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్నూరుకాపు ఫంక్షన్హాల్ నిర్మాణ కమిటీ సభ్యులు యామిని ముత్యం, ఉమ్మెడ పోశెట్టి, సర్పంచ్ మురళి, ఉపసర్పంచ్ భరత్, సాగర్, నర్సయ్య, లక్ష్మీనారాయణ, లింగం పాల్గొన్నారు.
పద్మశాలీ కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ
పద్మశాలీ కల్యాణ మండపం నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే జీవన్రెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం సభ్యులు రాజశేఖర్, బాలగంగాధర్, సాగర్, గణేశ్ పాల్గొన్నారు. మున్నూరుకాపు, పద్మశాలీ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జీవన్రెడ్డిని సన్మానించారు.