వర్షాలు పడితేనే శ్రీరాంసాగర్ నిండేది. ప్రాజెక్టు నిండితేనే వరద కాలువ నిండుగా పారేది. ఆ నీటితోనే చెరువులను నింపేది. వానలు లేకుంటే ఎస్సారెస్పీ ఎండిపోయేది. వరదకాలువ బోసిపోయేది. ఇదంతా గతం.. ఇప్పుడంతా జలసిరులతో నిండుదనం. కేసీఆర్ అద్భుత ఇంజినీరింగ్ ప్రతిభతో నదికి నడకలు నేర్పారు. 300 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం గంగమ్మను పోచంపాడ్ వైపు మళ్లించారు. రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువ నుంచి కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంతో పాటు చెరువులను నింపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ తటాకాలు జలకళ సంతరించుకుంటుండడంతో రైతాంగం మురిసిపోతున్నది. కాళేశ్వర జలాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా జేజేలు పలుకుతున్నది.
– మోర్తాడ్/వేల్పూర్, జూలై 13
పక్కనే వరద కాలువ ఉన్నా చుక్క నీరూ దక్కని వైనం. పంటలు ఎండుతున్నాయన్నా కనికరించని కాంగ్రెస్ సర్కారు.. నీళ్లు అందకుండా నిర్మించిన తూములు.. గోస చూడలేక వరద కాలువలో పైపులేస్తే కేసులు వేసిన అప్పటి సర్కారోళ్లు.. ఇదంతా సమైక్య పాలనలో వరద కాలువ గుండా ఉన్న రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుల రంది తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముందుచూపుతో చేసిన పనులు ప్రస్తుతం సత్ఫలితాలిస్తున్నాయి. వరద కాలువ గుండా నిర్మించిన తూములు, సీసీ కాలువలతో చెరువులు నిండుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగువ నుంచి వస్తున్న కాళేశ్వర గంగ చెరువులను చేరుతూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతున్నది. మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చేరుతున్న కాళేశ్వర జలాలను చూస్తున్న రైతులు..సీఎం కేసీఆర్, మంత్రి వేములకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దొన్కల్ చెరువులకు జలకళ
మోర్తాడ్, జూలై 13: దొన్కల్ రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. వరదకాలువ ద్వారా దొన్కల్ చెరువులు నింపుకోవాలన్న ఆశ ఫలించింది. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న రైతుల ముఖాల్లో చిరునవ్వు వచ్చింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో సాగు, తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. వరదకాలువ తూము ద్వారా మంత్రి బుధవారం నీటిని విడుదల చేయడంతో చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సాగు, తాగునీటికి ఇబ్బందులకు చెక్..
వరదకాలువ ద్వారా విడుదల చేసి నీళ్లు దొన్కల్ గ్రామానికి చెందిన రాజుల కుంటకు చేరుతున్నాయి. అక్కడి నుంచి పెద్ద చెరువు, ఆ తర్వాత మాలకుంటకు చేరుతాయి. ఈ మూడు చెరువులను నింపడంతో గ్రామంలో తాగునీటి సమస్య దూరం కానుండగా, పెద్దచెరువు, మాలకుంటలు నిండడంతో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. వేసవికాలంలో, వర్షాభావ పరిస్థితుల కారణంగా దొన్కల్ రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారు. చెరువుల్లో నీళ్లు లేక భూగర్భజలమట్టం తగ్గి తాగు, సాగునీటికి అవస్థలు పడేది.పక్కనే పెద్దవాగు, వరద కాలువ ఉన్నా ప్రయోజనం లేక నీటి కోసం నానా తంటాలు పడేవారు. కొన్ని సందర్భాల్లో వరదకాలువ నుంచి పైపులు వేసి పెద్దవాగు నింపుకొన్న సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం వరదకాలువ నీరు చెరువుల్లోకి చేరడంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. పెద్దచెరువు కింద 200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి. పెద్దచెరువు, మాలకుంట సమీపంలో భూగర్భ జలమట్టం పెరగడంతో మరో 300ఎకరాల పంటలకు ఢోకా లేదు.
వేల్పూర్కు కాళేశ్వర జలాలు..
వేల్పూర్, జూలై 13: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామ సమీపంలో వరద కాలువ నుంచి విడుదలవుతున్న నీళ్లు మూడు చెరువుల్లోకి వెళ్తున్నాయి. వరద కాలువకు రూ.30 లక్షలతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పైప్లైన్ వేయించారు. అంక్సాపూర్ గ్రామంలోని ఊర చెరువు, ధర్మారెడ్డి, బంజని కుంటలు నిండుతున్నాయి. దీంతో ఈ చెరువుల కింద ఉన్న సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందనున్నది. గ్రామంలోని మూడు చెరువులు జలకళను సంతరించుకుంటే సాగునీటితోపాటు భూగర్భ జలమట్టం పెరుగుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అంక్సాపూర్తోపాటు పోచంపల్లి గ్రామంలోని చెరువుల్లోకి నీరు చేరుతున్నది. కాళేశ్వరం జలాల ద్వారా పోచంపల్లి గ్రామంలోని సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వరద కాలువ ద్వారా మండలంలో ప్రత్యక్షంగా రెండు గ్రామాలకు, పరోక్షంగా నవాబ్ లిఫ్ట్ ద్వారా 8 గ్రామాలకు సాగునీరు అందుతుంది. లక్ష్మీ డీ3 కెనాల్ ద్వారా పడగల్ గ్రామంలోని నవాబ్ చెరువులోకి కాళేశ్వరం జలాలు చేరనున్నాయి. దీంతో లిఫ్ట్ కింద సుమారు 8వేల ఎకరాలకు నీరు అందనున్నది. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల శివారులోని 8,600 ఎకరాలకు సాగునీటికి ఢోకా లేదని రైతులు సంబురపడుతున్నారు.
మొదటిసారిగా నిండుతున్న చెరువులు
మొదటిసారి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో దొన్కల్ చెరువులకు వరదకాలువ నీళ్లు వెళ్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో దొన్కల్ వద్ద తూము నిర్మించినప్పటికీ ఒక్కసారి కూడా చెరువులు నింపిన సందర్భం లేదు. తూము ఉన్నా ప్రయోజనం మాత్రం లేకపోయేది. ఇదే విషయాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా గతంలో నిర్మించిన తూము వరదకాలువ నీటి విడుదలకు పనికిరాకుండా ఉండడంతో దాన్ని తీసివేయించి, తక్కువ ఎత్తులో చెరువులకు నీళ్లు పంపేలా తూము నిర్మించాలని అధికారులకు సూచించి, రూ.30లక్షలు మంజూరు చేయించారు. తూము పనులు పూర్తవ్వగానే నీళ్లు వేళ్లేందుకు మరో రూ.33లక్షలు నిధులు మంజూరు చేయించగా, ఆ పనులు కూడా పూర్తవడంతో బుధవారం వరదకాలువ తూము ద్వారా మంత్రి నీటిని విడుదల చేశారు.
ఎండిపోయే పరిస్థితి నుంచి… రెండు పంటలు పండించుకునే స్థాయికి..
వరదకాలువ నీళ్లు దొన్కల్ చెరువుల్లోకి చేరుతుండడంతో పంటలసాగు పరిస్థితి మారనున్నది. గతంలో రైతులు వేసిన పంటలకు సాగునీరందక ఎండిపోయేవి. బోర్లు ఎత్తిపోవడం, చెరువుల్లో నీళ్లు లేకపోవడం, పెద్దవాగులో సైతం నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలయ్యేవారు. వరదకాలువలో ఉన్న నీటిని పైపుల ద్వారా పెద్దవాగులోకి తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొనేది. మంత్రి వేముల ముందుచూపుతో చేపట్టిన తూము, సీసీ కాలువ నిర్మాణంతో దొన్కల్ గ్రామ రైతులు, ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపినట్లయ్యింది.
పంటలకు ఢోకా లేదు..
కాళేశ్వర జలాలతో పంటల సాగుకు ఢోకా లేదు. మా ఊరి పక్క నుంచి వరద నీరు పారుతున్నా గతంలో చుక్క నీరూ గ్రామంలోకి వచ్చేది కాదు. ప్రస్తుతం పైప్లైన్ ద్వారా గ్రామంలోని చెరువుల్లోకి నీరు చేరడం ఎంతో సంతోషంగా ఉన్నది. దీంతో పంటల సాగుకు ఇబ్బందులు ఉండవు. సాగునీటి కష్టాలు తీర్చిన మంత్రికి కృతజ్ఞతలు.
-శ్రీధర్, అంక్సాపూర్
భూగర్భ జలమట్టం పెరుగుతుంది..
వరదకాలువలోని కాళేశ్వరం జలాలతో చెరువులను నింపడంతో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. ఆయకట్టుతోపాటు బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రాజులకుంటతో గ్రామంలో సాగునీటి ఇబ్బందులు దూరమవుతాయి. పెద్ద చెరువు, మాల కుంటలు నింపడంతో ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులుండవు.
– చిన్నారెడ్డి,రైతు, మాజీ సర్పంచ్, దొన్కల్
నీటి సరఫరాకు ఇబ్బందుల్లేవ్..
తూము నుంచి చెరువులు నిం పేందుకు సీసీ కాలువ నిర్మించ డంతో నీటి సరఫరాకు ఇబ్బందు లు ఉండవు. వర్షాలు లేని టైంలో చెరువుల ను నింపేందుకు సరారు చర్యలు తీసుకుంటున్నందుకు ఎం తో సంతోషంగా ఉన్నది. ప్రాజెక్ట్ల నీళ్లు నిండితేనే వరదకాలువలో నీళ్లను చూసేటోళ్లం. కానీ ప్రాజెక్టుల నీళ్లు లేకున్నా కాళేశ్వరం నీళ్ల తో చెరువులను నింపుతున్న మంత్రికి రుణపడి ఉంటాం.
– చింతకింది ముత్యం, రైతు, దొన్కల్
మా కల నెరవేరింది..
వరదకాలువతో చెరువులు నింపుకోవాలన్న మా కల మంత్రి ప్రశాంత్రెడ్డి కృషితో నెరవేరింది. కాంగ్రెస్ హయాంలో తూ ము నిర్మించినా నిరుపయోగంగా ఉండే. ఒక్కసా రి కూడా నీళ్లు నింపుకొన్న ది లేదు. ఇప్పుడు మా గ్రామానికి సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరమయినట్లే.
– తాటిపల్లి శ్రీనివాస్, రైతు, దొన్కల్